Anil Ambani: రూ.2929 కోట్ల మోసం కేసు.. అనిల్ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:02 AM
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కామ్) డైరెక్టర్ అనిల్ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు జరిపింది. ఎస్బీఐని రూ.2929.05 కోట్ల మేర మోసగించిన కేసులో భాగంగా ముంబైలోని ఆయన నివాసంలో శనివారం సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ/ముంబై, ఆగస్టు 23: రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కామ్) డైరెక్టర్ అనిల్ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు జరిపింది. ఎస్బీఐని రూ.2929.05 కోట్ల మేర మోసగించిన కేసులో భాగంగా ముంబైలోని ఆయన నివాసంలో శనివారం సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబైలోని ఆర్కామ్ కార్యాలయంతో పాటు అనిల్ నివాసంలో తనిఖీలు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎస్బీఐ ఫిర్యాదు మేరకు ఆర్కామ్, సంస్థ డైరెక్టర్ అనిల్ అంబానీ, గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులపై సీబీఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
నేరపూరిత కుట్ర, మోసం తదితర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. నిందితులు కుట్రపూరితంగా తప్పుడు ప్రతిపాదనలతో ఆర్కామ్కు రుణాలను మంజూరు చేయించుకున్నారన్నారు. ఎస్బీఐ ఫిర్యాదు మేరకు 2018 లెక్కల ప్రకారం.. ఆర్కామ్ వేర్వేరు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.40 వేల కోట్లకు పైగా బకాయిలు ఉంది. ఈ సంస్థ వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ ఒక్కదానికే రూ.2929.05 కోట్ల నష్టం వాటిల్లింది.