UPSC: సివిల్స్ అభ్యర్థులకు యూపీఎస్సీ కొత్త నిబంధన
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:11 AM
సివిల్ సర్వీసుల ప్రిలిమినరీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఇకపై ఆన్లైన్ అప్లికేషన్తో పాటు వయసు, రిజర్వేషన్లను నిర్ధారించే పత్రాలను కూడా అప్లోడ్ చేయాలని యూపీఎస్సీ సూచించింది. గతంలో ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాక ఈ పత్రాలను సమర్పించాల్సి ఉండేది.

ప్రిలిమ్స్ దరఖాస్తుతో పాటే వయసు, రిజర్వేషన్ల నిర్ధారణ పత్రాలు తప్పనిసరి
గతంలో ప్రిలిమినరీ అర్హత సాధించాకే సమర్పించాల్సి ఉండేది
న్యూఢిల్లీ, జనవరి24: సివిల్ సర్వీసుల ప్రిలిమినరీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఇకపై ఆన్లైన్ అప్లికేషన్తో పాటు వయసు, రిజర్వేషన్లను నిర్ధారించే పత్రాలను కూడా అప్లోడ్ చేయాలని యూపీఎస్సీ సూచించింది. గతంలో ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాక ఈ పత్రాలను సమర్పించాల్సి ఉండేది. ఇటీవల ఓ ఐఏఎస్ ప్రొబేషనర్ పూజా ఖేడ్కర్ తప్పుడు పత్రాలతో ఓబీసీగా ప్రకటించుకోవడంతో పాటు అంగవైకల్యానికి సంబంధించి తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు రావడంతో యూపీఎస్సీ అధికారులు ఈ నిబంధన పెట్టారు. మరోవైపు యూపీఎస్సీ సివిల్స్- 2025 నోటిఫికేషన్ ఈ నెల 22న విడుదలయింది. అఖిల భారత సర్వీసుల్లో 23 విభాగాల్లోని 979 ఖాళీల భర్తీకి యూపీఎస్సీ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తుల దాఖలుకు ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కల్పించింది. మే 25న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.