Buddha Relics: 127 ఏళ్ల తర్వాత భారత్కు బుద్ధుడి అవశేషాలు
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:13 AM
బ్రిటిష్ పాలనలో భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుడి పవిత్ర అవశేషాలను 127 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి తీసుకొచ్చారు.
న్యూఢిల్లీ, జూలై 30: బ్రిటిష్ పాలనలో భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుడి పవిత్ర అవశేషాలను 127 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ అద్భుత ఘట్టం మన దేశానికి, మన సాంస్కృతిక వారసత్వానికి గర్వకారణమని మోదీ పేర్కొన్నారు. ఈ పవిత్ర అవశేషాలు బుద్ధుడితో భారతదేశానికి గల అనుబంధాన్ని, ఆయన ఉన్నత బోధనలను ప్రతిబింబిస్తాయని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ అంతర్జాతీయ వేలంలో కనిపించిన ఈ అవశేషాలను తిరిగి భారత్కు తీసుకురావడానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ప్రధాని తెలిపారు. 1898లో ఉత్తరప్రదేశ్లోని పిపర్వాహలో (భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపం) ఓ పురాతన బౌద్ధ స్తూపం తవ్వకాల్లో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. గౌతమ బుద్ధుడివని భావిస్తున్న అస్థి అవశేషాలు, విలువైన పేటికలు, బంగారు ఆభరణాలు, రత్నాలు వీటిలో ఉన్నాయి.