Delhi elections Manifesto : పోటీ పరీక్షల అభ్యర్థులకు 15వేలు
ABN , Publish Date - Jan 22 , 2025 | 01:58 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన రెండో మేనిఫెస్టోను విడుదల చేసింది. తొలి మేనిఫెస్టోలో మహిళా ఓటర్లను ఆకర్షించేలా పలు పథకాలు ప్రకటించిన బీజేపీ... ఇప్పుడు
దరఖాస్తు ఫీజు, ప్రయాణ ఖర్చుల రీయింబర్స్మెంట్
ఢిల్లీ ఎన్నికలకు రెండో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
న్యూఢిల్లీ, జనవరి 21: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన రెండో మేనిఫెస్టోను విడుదల చేసింది. తొలి మేనిఫెస్టోలో మహిళా ఓటర్లను ఆకర్షించేలా పలు పథకాలు ప్రకటించిన బీజేపీ... ఇప్పుడు విద్య, సంక్షేమం, యువజన సాధికారతపై దృష్టి సారించింది. ఈ మేరకు ‘సంకల్ప్ పత్ర’ను ఆ పార్టీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు రూ.15వేల సహాయంతో పాటు దరఖాస్తు ఫీజు, ప్రయాణ ఖర్చులను ఒక్కో అభ్యర్థికి రెండుసార్లు చొప్పున రీయింబర్స్మెంట్ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల సంక్షేమంలో భాగంగా ఇంటి పనివారి కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వారికి రూ.10లక్షల బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా, వారి పిల్లలకు ఉపకార వేతనాలు, 6 నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు వర్తింపజేస్తామన్నారు. అదేవిధంగా ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.10లక్షల జీవిత బీమా, రూ.5లక్షల ప్రమాద బీమా, వాహన బీమా, వారి పిల్లలకు ఉపకార వేతనాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టైపెండ్ స్కీమ్’ కింద ఎస్సీ విద్యార్థులకు నెలకు రూ.1,000 స్టైపెండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.