Voter Turnout: తొలి దశలో 64.66ు ఓటింగ్
ABN , Publish Date - Nov 07 , 2025 | 05:13 AM
బిహార్ చరిత్రలోనే మొదటిసారిగా 64.66ు మంది గురువారం జరిగిన తొలి విడత ఎన్నికల్లో ఓటు వేశారు.
బిహార్లో తొలిసారి భారీ పోలింగ్
న్యూఢిల్లీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): బిహార్ చరిత్రలోనే మొదటిసారిగా 64.66ు మంది గురువారం జరిగిన తొలి విడత ఎన్నికల్లో ఓటు వేశారు. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాల్గొన్న 3.75 కోట్ల మంది ప్రజలు ఉత్సాహంతో పోలింగ్లో పాల్గొన్నారు. 1,314 మంది అభ్యర్థులు తొలి దశలో తమ భవిష్యత్తును పరీక్షించుకున్నారు. వీరిలో 122 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. గత మూడు దశాబ్దాల్లో అత్యధిక పోలింగ్ జరిగిందంటే అర్థం నవంబరు 14న ప్రజలు కొత్త ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తున్నట్లే స్పష్టమవుతోందని జన సురాజ్ సంస్థాపకుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. 1998లో మొదటిసారి లోక్సభ ఎన్నికల్లో 64.66ు పోలింగ్ జరిగినప్పుడు బీజేపీ, సమతా పార్టీ కలిసి 30 సీట్లు గెలుచుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2000లో పశుగ్రాసం కుంభకోణంతో లాలూ ప్రసాద్ యాదవ్ రాజీనామా అనంతరం జరిగిన ఎన్నికల్లో 62.57ు ఓటర్లు పోలింగ్లో పాల్గొని రబ్డీ దేవి సారథ్యంలో ఆర్జేడీని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఈసారి మొదటిసారి అత్యధిక శాతం మంది ప్రజలు ఓటింగ్లో పాల్గొనడంతో మార్పు ఖాయమంటున్నారు. తొలిదశ పోటీలో రాఘోపూర్ నుంచి ఆర్జేడీ నేత, సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, బీజేపీ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధురి, మహువా నుంచి తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్, అలీనగర్ నుంచి బీజేపీ సీనియర్ నేత మైథిలీ థాకూర్, మొకామా నుంచి జేడీ(యూ) నేత, హత్యానేరంపై జైలు పాలై న అనంత్ సింగ్ తదితర ప్రముఖులు ఉన్నారు.
త్రికోణపు పోటీ..
అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పూర్తి స్థాయిలో జన సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ప్రచారంలో తిరగడంతో చాలా చోట్ల త్రికోణపు పోటీ ఏర్పడింది. ఈ పార్టీ అన్ని స్థానాల్లో పోటీకి దిగింది. తేజస్వి యాదవ్ గతంలో తన తల్లి రబ్డీ దేవీని ఓడించిన బీజేపీ నేత సతీష్ కుమార్ను ఎదుర్కొంటున్నారు. సతీష్ ఈసారి జేడీ(యూ) గుర్తుపై పోటీ చేస్తున్నారు. మొత్తం 45,341 పోలింగ్ స్టేషన్లలో అత్యధిక పోలింగ్ స్టేషన్లు (36,733) గ్రామీణ ప్రాం తాల్లోనే ఉండడం గమనార్హం. ఈ ఎన్నికల్లో దాదాపు 10.72 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్డీఏకు మహాగఠ్బంధన్కు మధ్య ప్రధాన పోటీ జరుగుతున్నప్పటికీ ఎన్డీఏలో ఐదు పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వీటిలో జనతాదళ్ (యునైటెడ్), బీజేపీ, చిరాగ్ పాశ్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ, జితన్ రాం మాఝీకి చెందిన హిందుస్థాన్ అవామీ మోర్చా, ఉపేంద్ర కుశ్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా ఉన్నాయి. మహాగఠ్బంధన్లోనూ ఆరు పార్టీలు రంగంలో ఉన్నాయి. వీటిలో ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్), వికా్సశీల్ ఇన్సాఫ్ పార్టీ (ముఖేష్ సహానీ) ఉన్నాయి. ఇక ఎన్నికలకు రెండు నెలల ముందు ఎన్నికల కమిషన్ నిర్వహించిన వివాదాస్పద ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణ (ఎస్ఐఆర్) వివాదాస్పదంగా మారింది. బీజేపీని గెలిపించేందుకే ఈ సవరణ చేపట్టారని, లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించనున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఆధార్ను కూడా గుర్తింపు కార్డుగా అంగీకరించాలని కమిషన్ను ఆదేశించడంతో ఈ ఆరోపణలు సద్దుమణిగాయి. అయితే అదే సమయంలో కర్ణాటక, హరియాణా, మహారాష్ట్ర తదితర స్థానాల్లో ఎన్నికల కమిషన్ భారీ అక్రమాలకు తావిచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పోలింగ్కు ఒకరోజు ముందు రాహుల్ గాంధీ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఓ బ్రెజీలియన్ మోడల్ లరిస్సా పేరుతో 22సార్లు బోగస్ ఓటింగ్ జరిగిందని ఆధారాలతో బయటపెట్టారు. దాదాపు 25 లక్షల ఓట్లను హరియాణాలో చోరీ చేశారని ఆరోపించారు. ఈ ప్రభావం పోలింగ్పై పడే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా బిహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కావడం ప్రజాస్వామ్య విజయమని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గురువారం పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎంకు నిరసన సెగ
బిహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు నిరసన సెగ తగిలింది. లఖింసిరాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన పోలింగ్ నేపథ్యంలో తన నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను గురువారం సందర్శించారు. ఓ గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్తుండగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు. సిన్హాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్పై రాళ్లు, చెప్పులు, ఆవు పేడ విసిరారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.