Purnima Devi Barman: ‘ఉమెన్ ఆఫ్ ద ఇయర్’గా పూర్ణిమా దేవి
ABN , Publish Date - Feb 22 , 2025 | 04:21 AM
మెరుగైన, మరింత సమానమైన ప్రపంచం కోసం పనిచేస్తున్న ‘అసాధారణ నాయకుల’కు ఇచ్చే ఈ అవార్డుకు ప్రపంచ వ్యాప్తంగా 13 మంది మహిళలు ఎంపిక కాగా, భారత్ తరఫున పూర్ణిమా దేవిని మాత్రమే వరించింది.
అసోం జీవశాస్త్రవేత్తకు ‘టైమ్’ అరుదైన గౌరవం
న్యూయార్క్, ఫిబ్రవరి 21: అసోంకు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త, వన్యప్రాణుల సంరక్షకురాలు పూర్ణిమా దేవి బర్మన్ (45)కు అరుదైన గౌరవం లభించింది. 2025కు గాను టైమ్ మేగజైన్ ప్రకటించిన ‘ఉమెన్ ఆఫ్ ద ఇయర్’ జాబితాలో ఆమెకు స్థానం దక్కింది. మెరుగైన, మరింత సమానమైన ప్రపంచం కోసం పనిచేస్తున్న ‘అసాధారణ నాయకుల’కు ఇచ్చే ఈ అవార్డుకు ప్రపంచ వ్యాప్తంగా 13 మంది మహిళలు ఎంపిక కాగా, భారత్ తరఫున పూర్ణిమా దేవిని మాత్రమే వరించింది. అసోంకు చెందిన 45 ఏళ్ల పూర్ణిమా దేవి జంతుశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. అనంతరం స్థానికంగా ఉండే గ్రేటర్ అడ్జటంట్ జాతికి చెందిన పెద్ద కొంగలపై పీహెచ్డీ చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే అవి అంతరించిపోవడాన్ని గుర్తించారు. 2007 నుంచి వాటి సంరక్షణకు పాటుపడుతున్నారు. ఇందుకోసం ‘హర్గిలా ఆర్మీ’ పేరిట మహిళలతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఓ అంచనా ప్రకారం 2007లో అసోంలో మిగిలున్న 450 గ్రేటర్ అడ్జటంట్ కొంగల సంఖ్య 2023 నాటికి 1800కు పెరిగింది.