అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కుట్ర కోణం
ABN , Publish Date - Jun 19 , 2025 | 03:17 AM
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై భిన్న కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.
తోసిపుచ్చలేమన్న దర్యాప్తు అధికారులు
అహ్మదాబాద్, జూన్ 18!: అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై భిన్న కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) నేతృత్వంలో గుజరాత్ పోలీసులు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) సంయుక్తంగా విచారణ చేపట్టాయి. మరోవైపు అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దీనికి సమాంతరంగా స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించింది. టేకాఫ్ అయిన తర్వాత క్షణాల వ్యవధిలోనే విమానం కుప్పకూలడం వెనుక ఏం జరిగి ఉంటుందనే కోణంలో అధికారులు కూపీ లాగుతున్నారు. ఇందులో కుట్ర కోణాన్ని కూడా తోసిపుచ్చలేమని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రచురించింది. ప్రమాదం జరిగిన సమయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆపరేషన్లలో పాల్గొన్న సిబ్బందిని ప్రశ్నించి, వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. అలాగే విమానం టేకాఫ్ కోసం క్లియరెన్స్ ఇచ్చిన కీలక సిబ్బంది ఫోన్లను దర్యాప్తు అదికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలోని సీసీ టీవీ ఫుటేజీని సేకరించారు. ఇదిలాఉండగా, అహ్మదాబాద్కు చెందిన వ్యాపారి రాజేశ్ పటేల్ (57)... ప్రమాదం జరిగిన స్థలం నుంచి సేకరించిన దాదాపు 70 తులాల బంగారు ఆభరణాలు, 8 నుంచి 10 వెండి వస్తువులు, రూ.50వేల నగదు, 20 అమెరికన్ డాలర్లతో పాటు కొన్ని పాస్పోర్టులను పోలీసులకు అప్పగించి మానవత్వం చాటుకున్నారు