అమ్మా.. నేను చోరీ చేయలేదు!
ABN , Publish Date - May 24 , 2025 | 05:53 AM
చేయని దొంగతనాన్ని తనపై మోపారన్న మనస్థాపంలో 13ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు సూసైడ్ నోట్ రాశాడు. అందులో ‘అమ్మా నేను దొంగతనం చేయలేదమ్మా’ అని బాధపడ్డాడు.
సూసైడ్ నోట్ రాసి 13 ఏళ్ల బాలుడి ఆత్మహత్య
కోల్కతా, మే 23: చేయని దొంగతనాన్ని తనపై మోపారన్న మనస్థాపంలో 13ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు సూసైడ్ నోట్ రాశాడు. అందులో ‘అమ్మా నేను దొంగతనం చేయలేదమ్మా’ అని బాధపడ్డాడు. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిడ్నాపోర్లో ఇటీవల ఈ ఘటన జరిగింది. బాలుడి పేరు కృష్ణేందు దాస్. శుభాంకర్ దీక్షిత్ అనే వ్యక్తి స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడు షాపులో లేని సమయంలో కృష్ణేందు మూడు చిప్స్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్లిపోయాడని స్థానికులు చెప్పారు. దీక్షిత్ కోపంతో నేరుగా బాలుడి ఇంటికి వెళ్లాడు.
అక్కడ ఆ బాలుడు దీక్షిత్కు 20 రూపాయలు ఇచ్చాడు. అయినా, కృష్ణేందును తనతో పాటు దుకాణానికి తీసుకెళ్లిన దీక్షిత్, చిప్స్ ప్యాకెట్స్ ధర 15రూపాయలను మినహాయించుకొని ఆ చిన్నారికి ఐదు రూపాయలు తిరిగిచ్చేశాడు. ఆపై చిన్నారిని కొట్టి.. స్థానికుల ఎదుట క్షమాపణలు చెప్పించుకున్నాడు. దీంతో బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.