Bihar: తుపాకీతో బెదిరించి పంజాబ్ నేషనల్ బ్యాంకులో డబ్బు దోచుకెళ్లిన టీనేజర్లు
ABN , Publish Date - Feb 19 , 2025 | 10:29 PM
బీహార్లో ఇద్దరు టీనేజర్లు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. ముసుగు ధరించి వచ్చిన వారు తుపాకీతో సిబ్బందిని కస్టమర్లను బెదిరించి రూ.1.5 లక్షలను ఎత్తుకెళ్లారు. వైశాలి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: బీహార్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ముసుగేసుకుని బ్యాంకులోకి చొరబడ్డ ఇద్దరు టీనేజర్లు తుపాకీతో లోపలున్న వారిని బెదిరించి రూ.1.5 లక్షలతో పారిపోయారు. వైశాలీ జిల్లాలోని హాజీపూర్ ప్రాంతంలో గల పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. సినీ ఫక్కీలో కేవలం 90 సెకెన్లలో నిందితులిద్దరూ డబ్బు దోచుకెళ్లారని అక్కడి వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు (Bihar Bank Robbery).
Mahakumbh: మమత 'మృత్యుకుంభ్' వ్యాఖ్యలను సమర్ధించిన శంకరాచార్య
ఫుటేజీలో కనిపించిన దాని ప్రకారం, ముఖానికి ముసుగు ధరించిన ఇద్దరు టీనేజర్లు బ్యాంకు లోపలికి ప్రవేశించారు. వారిలో ఒకరు తుపాకీతో కస్టమర్లను బెదిరించి అందరికీ ఓమూలన నిలబెట్టాడు. మరో వ్యక్తి అక్కడున్న నగదు మొత్తం తీసేసుకున్నాడు. భయాభ్రాంతులకు లోనైన కస్టమర్లు, సిబ్బంది తామున్న చోటునే కదలకుండా ఉండిపోవడం వీడియోలో రికార్డైంది. డబ్బంతా తీసుకున్నా వారు బ్యాంకుకు బయటి నుంచి తాళం పెట్టి వెళ్లిపోయారు.
Rekha Gupta: మోదీకి కృతజ్ఞతలు: రేఖా గుప్తా తొలి స్పందన
నిందితుల్లో ఒకరికి 17 ఏళ్లు, మరొకరికి 18 ఏళ్లు ఉంటాయని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మొత్తం రూ.1.5 లక్షలను దోచుకెళ్లారని అన్నారు. వారి చిత్రాలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించామని తెలిపారు. నిందితులను గుర్తించిన వారు తమకు సమాచారం అందించాలని కోరారు. అంతకుముందు రోజునే రాజధాని పట్నాలో ఎన్కౌంటర్ జరిగింది. ఆ వెంటనే బ్యాంకు దోపిడీ వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో సంచలనానికి దారి తీసింది.
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి