The US Is Seeking: చైనాను ఎదుర్కోవడానికి భారత్ సాయం కావాలి
ABN , Publish Date - Oct 16 , 2025 | 06:12 AM
భారత్పై అడ్డగోలుగా 50శాతం సుంకాలు విధించిన అమెరికా.. ఇప్పుడు చైనాను ఎదుర్కొనేందుకు మాత్రం...
అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యలు
వాషింగ్టన్, అక్టోబరు 15: భారత్పై అడ్డగోలుగా 50శాతం సుంకాలు విధించిన అమెరికా.. ఇప్పుడు చైనాను ఎదుర్కొనేందుకు మాత్రం భారత్ సాయం కావాలని కోరుకుంటోంది. అమెరికాలోని టెక్, రక్షణ, వాహన కంపెనీలకు అత్యంత కీలకమైన అరుదైన లోహాల సరఫరాపై చైనా నియంత్రణలు విధించడమే దీనికి కారణం. అమెరికాలో ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ..‘‘ఇది చైనాకు, ప్రపంచానికి మధ్య జరుగుతున్న పోరు. మొత్తం ప్రపంచ పారిశ్రామిక, పంపిణీ వ్యవస్థలపైనే చైనా బల్లెం ఎక్కుపెట్టింది. అది మనల్ని నియంత్రించలేదు. దీనిపై మేం మా మిత్రదేశాలతో మాట్లాడుతున్నాం. ఈ వారంలో సమావేశం కాబోతున్నాం. ఈ అంశంలో యూరప్ దేశాలు, భారత్తోపాటు ఆసియాలోని ప్రజాస్వామ్య దేశాల సహకారం కోరుతున్నాం. అమెరికా ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తుంటే.. చైనా యుద్ధానికి దిగుతోంది’’ అని పేర్కొన్నారు.