Amid Tensions over Oil Imports From Russia: రష్యా చమురుపై మళ్లీ మంటలు
ABN , Publish Date - Oct 17 , 2025 | 06:06 AM
రష్యా చమురు కొనుగోళ్ల అంశం మరోసారి మంటలు రేపుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తానని మోదీ తనకు....
కొనుగోళ్లు ఆపేస్తామని మోదీ హామీ ఇచ్చారు
ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా ఇదొక గొప్ప ముందడుగు: ట్రంప్
ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టిన భారత్
ఆయనతో మోదీ మాట్లాడలేదని ప్రకటన
వాషింగ్టన్/న్యూఢిల్లీ, అక్టోబరు 16: రష్యా చమురు కొనుగోళ్ల అంశం మరోసారి మంటలు రేపుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తానని మోదీ తనకు హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనగా.. మోదీ ట్రంప్కు భయపడి, చెప్పినట్టు వింటున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది. మరోవైపు అసలు బుధవారం ట్రంప్, మోదీ మాట్లాడుకోనే లేదని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది.
మోదీ నా స్నేహితుడు: ట్రంప్
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తామని భారత ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఆపేదిశగా ఇదొక గొప్ప ముందడుగు అని వ్యాఖ్యానించారు. బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఆయన అధ్యక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ నా స్నేహితుడు. మా మధ్య గొప్ప బంధం ఉంది. కానీ రష్యా నుంచి భారత్ చమురుకొనుగోలు చేయడం ఏమీ బాగోలేదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని కొనసాగించడానికి అది తోడ్పడుతోంది. అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని మోదీ నాకు హామీ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు చమురు కొనుగోళ్లను ఆపేయలేరు. దానికి కొంత సమయం పడుతుంది. ఆ ప్రక్రియ ఇప్పుడు మొదలైంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్పై యుద్ధం ఆపాక రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అని, ఆయనకు తానంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. మోదీ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాల ని తాను కోరుకోవడం లేదని పేర్కొన్నారు. భారత్కు ఒకప్పుడు తరచూ నేతలు మారిపోయేవారని.. కానీ మోదీ సుదీర్ఘకాలం కొనసాగుతున్నారని చెప్పారు.
మా ప్రయోజనాలకు అనుగుణంగా
చమురు కొనుగోళ్లు: భారత్
రష్యా చమురు కొనుగోలు నిలిపివేస్తామని మోదీ హామీ ఇచ్చారన్న ట్రంప్ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తప్పుబట్టింది. బుధవారం మోదీ, ట్రంప్ మాట్లాడుకోనే లేదని స్పష్టం చేసింది. భారత్ చము రు కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉందని.. అలాంటప్పుడు జాతీయ ప్రయోజనాలు, మార్కెట్ స్థితిగతులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విభిన్న మార్గాల్లో చమురు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు పెంచేందుకూ చర్యలు చేపడుతున్నామని, దానిపై చర్చలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. కాగా, భారత్-రష్యా మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతం అవుతోందని, భారత జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే చమురు కొనుగో లు చేస్తోందని భారత్లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ పేర్కొన్నారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న భారత్.. తమకు కొంతమేర చైనా కరెన్సీ యువాన్లలో చెల్లింపు చేస్తోందని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ తెలిపారు. ఇది స్వల్పమేనని, చాలా వరకు నేరుగా రష్యా కరెన్సీలోనే చెల్లింపులు జరుగుతున్నాయని వివరించారు.
ట్రంప్కు మోదీ భయపడుతున్నారు: రాహుల్
రష్యా కొనుగోళ్లు ఆపేస్తామని మోదీ హామీ ఇచ్చారన్న ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ప్రధాని మోదీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. భారత విదేశాంగ విధా నం పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ట్రంప్కు ప్రధాని మోదీ భయపడుతున్నారని, అమెరికా చెప్పినట్టుగా నడుచుకుంటున్నట్టు కనిపిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘ట్రంప్ తరచూ భారత్ పరువు తీస్తుంటే.. మోదీ మాత్రం ప్రశంసలు కురిపిస్తూ సందేశాలు పెడతారు. అమెరికాలో భారత ఆర్థిక మంత్రి పర్యటనను రద్దు చేశారు. గాజా శాంతి ఒప్పందానికి వెళ్లలేదు. భారత్-పాక్ యుద్ధం తానే ఆపానని ట్రంప్ ఎన్నిసార్లు చెబుతున్నా.. మోదీ నేరుగా ఖండించడం లేదు..’’ అని ఎక్స్లో పోస్టు పెట్టారు. టారి్ఫలు వేస్తానని బెదిరించి భారత్-పాక్ యుద్ధాన్ని ఆపానని ట్రంప్ చెబుతూ ఉంటే.. ప్రధాని 56 అంగుళాల ఛాతీ ఏమైపోయిందని సీనియర్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు.