Terror Camps: బుద్ధి మారని పాక్..ఉగ్ర శిబిరాల పునర్నిర్మాణం
ABN , Publish Date - Jun 29 , 2025 | 03:58 AM
ఆపరేషన్ సిందూర్లో ధ్వంసమైన ఉగ్ర శిబిరాలను పునర్నిర్మించేందుకు ఏకంగా పాకిస్థాన్ ప్రభుత్వమే ముందుకు వచ్చింది. నిధులు సమకూర్చడంతోపాటు నిపుణుల సహకారాన్ని కూడా అందిస్తోంది.
న్యూఢిల్లీ, జూన్ 28: ఆపరేషన్ సిందూర్లో ధ్వంసమైన ఉగ్ర శిబిరాలను పునర్నిర్మించేందుకు ఏకంగా పాకిస్థాన్ ప్రభుత్వమే ముందుకు వచ్చింది. నిధులు సమకూర్చడంతోపాటు నిపుణుల సహకారాన్ని కూడా అందిస్తోంది. ఉగ్రవాద శిబిరాలను తిరిగి నిర్మించడంతోపాటు, వారి లాంచ్ప్యాడ్లను మరింత ఆధునీకరిస్తోంది. ఈ మేరకు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఆయా నిర్మాణాలకు నేరుగా పాక్ ప్రభుత్వంతోపాటు, పాక్ ఇంటెలిజెన్స్.. ఐసిస్, ఆ దేశ ఆర్మీ సహకరిస్తున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. పునర్నిర్మాణం చేస్తున్న వాటిలో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ, బహవాల్పూర్లోని జైషే మహమ్మద్ కేంద్ర కార్యాలయం కూడా ఉందని పేర్కొన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో చిన్న, సాంకేతిక వ్యవస్థలతో కూడిన శిబిరాల పునర్నిర్మాణానికి పాక్ ఆర్మీ సహా ఐసిస్ నిధులు సమకూరుస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీటిని ఎవరూ గుర్తించని తరహా అంటే ఎలాంటి సెన్సార్లకు చిక్కని వ్యవస్థలతో నిర్మిస్తున్నారని తెలిపాయి. అదేవిధంగా అంతర్జాతీయ సరిహద్దుల్లో 4 లాంచ్ ప్యాడ్స్ను తిరిగి ఆధునీకరిస్తున్నారు.