Pakistan Launches: తాలిబన్ మంత్రి భారత్ పర్యటన వేళ
ABN , Publish Date - Oct 11 , 2025 | 06:12 AM
అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులకు తెగబడింది. తెహ్రీక్-ఇ-తాలిబన్-పాకిస్థాన్ (టీటీపీ) స్థావరాలే లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి కాబుల్, పక్తికా ప్రావిన్స్లో దాడులు చేసింది....
అఫ్గాన్పై పాక్ దాడులు!
ఇస్లామాబాద్/పాకిస్థాన్/న్యూఢిల్లీ, అక్టోబరు 10: అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులకు తెగబడింది. తెహ్రీక్-ఇ-తాలిబన్-పాకిస్థాన్ (టీటీపీ) స్థావరాలే లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి కాబుల్, పక్తికా ప్రావిన్స్లో దాడులు చేసింది. తాలిబన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ భారత్లో పర్యటిస్తుండగానే ఈ దాడులు చోటుచేసుకున్నాయి. అఫ్గానిస్థాన్-భారత్కు దగ్గరవ్వడం జీర్ణించుకోలేకనే పాక్ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. పాక్కు కొరకరాని కొయ్యగా మారిన టీటీపీ చీఫ్ నూర్ వలీ మెహ్సూద్ను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడి జరిగినట్లు సమాచారం. అయితే, మెహ్సూద్ పేరు వెల్లడించకుండా.. తమ సైనిక కాన్వాయ్పై దాడికి పాల్పడిన 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని పాక్ ప్రకటించింది. మరోవైపు, భారత్-అఫ్గాన్ మధ్య స్నేహ బంధం చిగురిస్తోంది. వాణిజ్యం, మానవతా సాయం కోసం కాబుల్లో భారత్ నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ను పూర్తిస్థాయి రాయబార కార్యాలయం హోదాకు అప్గ్రేడ్ చేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. ఇటు ఢిల్లీలో ముత్తాఖీ నిర్వహించిన మీడియా సమావేశానికి ఆయన కోరిక మేరకు.. మహిళా జర్నలిస్టులను అనుమతించలేదు.