Mob violence: బంగ్లాదేశ్లో మరో మూక దాడి
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:21 AM
దీపు చంద్ర దాస్ హత్య తర్వాత బంగ్లాదేశ్లో మరో హిందువుపై మూకదాడి జరిగింది. రాజ్బరి జిల్లాలో ఓ వ్యక్తిపై కొంత మంది దాడి చేశారని...
హిందూ యువకుడు అమృత్ మండల్హత్య.. వారంలో రెండో ఘటన
ఎన్నికల్లో ‘అవామీ లీగ్’ పోటీపై నిషేధం
17 ఏళ్ల తర్వాత బంగ్లాకు తిరిగొచ్చిన ఖలేదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్
ఢాకా, డిసెంబరు 25: దీపు చంద్ర దాస్ హత్య తర్వాత బంగ్లాదేశ్లో మరో హిందువుపై మూకదాడి జరిగింది. రాజ్బరి జిల్లాలో ఓ వ్యక్తిపై కొంత మంది దాడి చేశారని, బాధితుడు మృతిచెందాడని పోలీసులు పేర్కొన్నారు. హోసైన్దంగా పాత మార్కెట్ వద్ద బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని 29 ఏళ్ల అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్గా గుర్తించారు. పంగ్షా మోడల్ పోలీసుస్టేషన్ ఆఫీసర్ మొయినుల్ మాట్లాడుతూ.. పరిస్థితి మూక హింసకు దారితీసే ముందు, అమృత్ మండల్పై స్థానికులు దోపిడీ ఆరోపణలు చేశారని చెప్పారు. మండల్ ‘సామ్రాట్ బాహిని’ అనే ఓ స్థానిక గ్రూపు నాయకుడని వెల్లడించారు. హత్యకు దారితీసిన కారణాలు, మూకదాడిలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. అమృత్ మండల్ హత్యతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దఎత్తున అదనపు పోలీసు బలగాలను మోహరించారు. వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండో మూక హత్య ఇది. ఈనెల 18న ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడాడనే ఆరోపణలతో మైమన్ సింగ్ డివిజన్ పరిధిలోని భలూకాలో దీప్ చంద్రదాస్ అనే కార్మికుడిని కొంత మంది హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ చెట్టుకు కట్టేసి నిప్పుపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఎన్నికల్లో పోటీకి ‘అవామీ లీగ్’కు నో చాన్స్
వచ్చే ఫిబ్రవరిలో జరిగే జాతీయ పార్లమెంటరీ ఎన్నికల్లో మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ పోటీ చేసేందుకు అవకాశం లేదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మీడియా కార్యదర్శి షఫికుల్ ఆలం ప్రకటన చేశారు. బుధవారం తాత్కాలిక ప్రభుత్వ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం అవామీ లీగ్ పార్టీ గుర్తింపును ఇప్పటికే రద్దు చేసిందని పేర్కొన్నారు. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హదీ హత్య తర్వాత దేశంలో నెలకొన్న అశాంతియుత పరిస్థితుల నేపథ్యంలో హోంశాఖ కార్యకలాపాలపై తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్కు ప్రత్యేక అసిస్టెంట్గా ఉన్న ఖుదా బక్ష్ చౌదురి రాజీనామా చేశారు.
నా వద్ద ఓ ప్లాన్ ఉంది: తారిఖ్
బంగ్లాదేశ్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రధాని ఖలేదా జియా, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ల కుమారుడు తారిఖ్ గురువారం దేశానికి తిరిగొచ్చారు. 17 ఏళ్ల స్వీయ బహిష్కరణ తర్వాత ఢాకాలో అడుగుపెట్టారు. తారి ఖ్ బీఎన్పీ తాత్కాలిక చైర్మన్గా ఉన్నారు. అభిమానులను ఉద్దేశించి తారిఖ్ కీలక ప్రసంగం చేశారు. మెరుగైన బంగ్లాదేశ్ను నిర్మించేందుకు తన వద్ద ఒక ప్లాన్ ఉందన్నారు. తనకు మద్దతు ఇవ్వాలని, దేశాన్ని నిర్మించడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. బంగ్లాదేశ్లో అన్ని మతాలకు చోటు ఉందని, సహనంగా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ఉస్మాన్ హాదీ హత్యకు న్యాయం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. పలు అవినీతి కేసులో దోషిగా తేలిన తారిఖ్ రెహ్మాన్ 2008 నుంచి ప్రవాసంలో ఉంటున్నారు.