AI coding: మా కంపెనీ కోడ్లో 30 శాతం ఏఐతోనే
ABN , Publish Date - May 01 , 2025 | 05:20 AM
మైక్రోసాఫ్ట్ కోడ్లో 20–30 శాతం వరకూ కృత్రిమ మేధతో రూపొందిస్తున్నామని సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. మెటా, గూగుల్ వంటి సంస్థలు కూడా కోడ్ అభివృద్ధిలో ఏఐపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని తెలిపారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడి
వాషింగ్టన్, ఏప్రిల్ 30: ప్రస్తుతం తమ కంపెనీ కోడ్లో 20 నుంచి 30 శాతం వరకూ కృత్రిమమేధ (ఏఐ)తోనే రాస్తున్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. ఏఐతో కోడ్ రాయించే ప్రక్రియను రోజురోజుకీ పెంచుతున్నామన్నారు. మంగళవారం అమెరికాలోని కాలిఫోర్నియాలో మెటా కంపెనీ ఏఐ అంశంపై నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్బర్గ్తో మాట్లాడుతూ సత్య నాదెళ్ల ఈ వివరాలు వెల్లడించారు. కోడ్ తయారీలో మెటా ఏ మేరకు ఏఐను వాడుతోందని జుకర్బర్గ్ని సత్య నాదెళ్ల ప్రశ్నించగా.. తనకు కచ్చితమైన వివరాలు తెలియవన్నారు. కాకపోతే భవిష్యత్తులో తమ కంపెనీకి చెందిన ఏఐ లామా వర్షన్లను రూపొందించేందుకోసం అవసరమైన ఏఐ మోడల్ను తయారుచేస్తున్నామని జుకర్బర్గ్ తెలిపారు. వచ్చే ఏడాదికి తమ ప్రాజెక్టుల అభివృద్ధిలో దాదాపు సగం మేర ఏఐనే వాడతామన్నారు. తమ కంపెనీ కోడ్లో 25 శాతానికిపైగా ఏఐతోనే రూపొందిస్తున్నామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గత ఏడాది అక్టోబరులో వెల్లడించారు.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..