Share News

Nanduri Venkata Subbarao: యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు

ABN , Publish Date - Aug 29 , 2025 | 05:37 AM

ఈ పాటలు నేను మద్రాసులో క్రైస్తవ కళాశాలలో పట్ట పరీక్షకు చదువుకొనే దినాలలో (1917-1918) వ్రాయ మొద లెట్టినాను. అప్పుడు నా అదృష్టంవల్ల మ – రా – శ్రీ అధికార్ల సూర్యనారాయణరావుగారి స్నేహభాగ్యం లభించటం, ఆయనతో కలిసి వాసంచేయటం కలిగింది. నన్నంతకు మునుపే...

Nanduri Venkata Subbarao: యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు

ఈ పాటలు నేను మద్రాసులో క్రైస్తవ కళాశాలలో పట్ట పరీక్షకు చదువుకొనే దినాలలో (1917-1918) వ్రాయ మొద లెట్టినాను. అప్పుడు

నా అదృష్టంవల్ల మ – రా – శ్రీ అధికార్ల సూర్యనారాయణరావుగారి స్నేహభాగ్యం లభించటం, ఆయనతో కలిసి వాసంచేయటం కలిగింది. నన్నంతకు మునుపే సారస్వత విషయాల్లో అంతో యింతో తరిఫీదు చేయుచున్న మా బసవరాజు అప్పారావు కూడా అక్కడే వుండేవాడు. వారితో ముచ్చట్లకు మ – రా – శ్రీ పాటిబండ అప్పారావుగారును వచ్చుట మామూలు.

వారందరు యెవరి రచనల గురించి వారు సొంపుగా మాట్లాడుకొంటుంటే నేనొకప్రక్క కూర్చుని విస్తుపోయి వినటం రివాజు.

ఒకనాడు కాలేజీ నుండి ట్రాంబండిలో వస్తుండగా, గొంతులో సన్నని రాగం బయలుదేరింది. దానిని నాలో నేను పాడుకోవాలని సాహిత్యం జ్ఞాపకం చేసుకోపోయాను. ఎప్పుడో విన్న పదంలాగున ‘‘గుండెగొంతుకలోన కొట్లాడుతాది’’ అన్న పల్లవి వచ్చింది. అదే మననం చేసుకోగా చేసుకోగా యిల్లు చేరేసరికి నేను వ్రాసిన మొదటిపాట తేలింది.

మా ‘‘జానకీ’’ పతికిన్నీ, అప్పారావుకున్నూ ఆ పాట గద్గదికతో వినిపించాను. ‘‘సెబాస్ వ్రాయ’’మన్నాడు జానకీపతి; ‘‘నీవు నిత్యం వాడే భాష కాదిది, యీ భాష సాయమున సత్యాన్వేషణం చేయలే’’ వన్నాడు మా బసవరాజు అప్పారావు.

ఏ సమయమున వెన్ను చరిచాడో, సూర్యనారాయణ! అప్పటినుండియు ‘‘యెంకి’’ని కవితారీతిని స్మరించుట నిముసమైన మానలేదు. ఆతడును అంతకంతకు దన అభిప్రాయమును బలపరుచుకొన్నాడు. మా అప్పారావు రానురాను తన అభిప్రాయం మార్చుకొని యిటీవల అతడును వల్లె అనుచున్నాడు.


పాటలు అప్రయత్నంగా వచ్చేటట్లు ప్రసాదించిన యెంకికి కృతజ్ఞుడనా? ప్రోత్సాహముచేసి వీపు దట్టిన అధికార్లవారికా? కవిత్వ కళారహస్యాలు తెలియజేప్పిన మా బసవరాజు అప్పరాయనికా? మువ్వురకును. ఇంకను సహృదయు లెందరో చాలకాలంనుంచీ నన్ను హెచ్చరిస్తున్నారు.

అందులో ‘‘యెంకి’’ పాటలు పదిమందికీ వినిపించినవారు దేశోద్ధారక శ్రీయుత కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు. ఆంధ్రపత్రికలో నేమి, భారతిలో నేమి ఆ పాటలకు తగిన తావొసంగి, యీ పుస్తకం అచ్చులో యెంతో అభిమానం చూపి, రెండు మాసములు యీ పుస్తకమును తమ మూడు పత్రికలలోనూ ఉచితముగా అడ్వర్‌టైజ్ చేయునట్లు ఆర్డరు దయచేసినారు. వారికెంతో కృతజ్ఞుడను.

‘సాహితి’ మా పత్రికే. అనసూయ, జనరంజని, జ్యోతి, సుజనరంజనీ పత్రికాధిపతులును నాకెంతో గౌరవమొసంగినారు. శారదయు అట్లే. వారూ తెలుగుతల్లి యొక్క నిజస్వరూపం చూడాలెనని ఉవ్విళ్లూరుచున్నవారే; తెలుగుపస, తెలుగునుడి, తెలుగువాదం, తెలుగురుచీ తెలిసికొని మనజాతి సాంప్రదాయాలలోగల సొగసు, జీవమూ, పదిమందికిన్నీ మనసుకెక్కించాలెనని కంకణము కట్టుకుని కృషి చేస్తున్నవారే. వారందరికీ నా నమస్కృతులు,

ప్రభువులలో మా ప్రభువులును, కవులూ, రసికులూ అయిన శ్రీశ్రీశ్రీ రాజా వేంకటాద్రి అప్పారావు బహద్దురుగారు యీ పాటలు విని ఆనందించేవారు. ఆ మహారాజు నాకెన్నో విధాల మేలుచేసినారు. వారివంశమాచంద్రార్కమూ నిలుచుగాత యని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. పాటలలో సగం పైగా నూజువీటిలో శ్రీవారి సన్నిధినే వ్రాశాను.

మా అభినవాంధ్రకవిమిత్రమండలి వారందరు నా ప్రాణమిత్రులు. మాప్రెసిడెంటుగారగు శ్రీయుత కోలవెన్ను రామకోటేశ్వరరావుగారి ద్వారా వారి దయకు బదులు నా వందనము లర్పిస్తున్నాను. ఇందులో చిత్రపటములు మా అడవి బాపిరాజుగారు వ్రాసినవి. ఆయన చిత్రములలోని మహోన్నత భావాలకు నా యెంకి పాటలే కారణమైతే, ధన్యుడను, ధన్యుఁడను!

మద్రాసు ఆంధ్ర పండిత మండలివారు నన్ను ప్రత్యేకం ఆహ్వానించి గౌరవించారు. ‘అప్పటినుంచీ పండితులంటే భయంపోయి భక్తే మిగిలింది, వారికి నా సమస్సులు.


కావ్యవ్యాకరణతీర్థులు బ్రహ్మశ్రీ పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రుల వారికి మా యెంకి పేరు చెపితేనే యెంతో అపేక్ష; పాటలంటే ప్రాణమే. పండితులయిన్నీ ‘‘యేమో, చదువురానివారి పాట’’లని తోసెయ్యరు. యెంకిపై పదిమంది హృదయాలల్లో భక్తి కలిగించింది వారున్నూ, బ్రహ్మశ్రీ పొక్కులూరి లక్ష్మీనారాయణగారున్నూ. వారిరువురికీ నా నమస్కారాలు.

తెలుగుదేశంలో పేరొందిన మేటిగాయకులు మ. రా. శ్రీ విద్వాన్‌ పారుపల్లి రామకృష్ణయ్యగారు యెంతో శ్రమపడి, శ్రద్ధతో యీ పాటలకు స్వరం వేశారు. వారికి నా నమస్కారాలు. అదే నేను పాడేవిధము.

తర్కవ్యాకరణ శాస్త్రవేత్తలగు బ్రహ్మశ్రీ గంటి సూర్యనారాయణ శాస్త్రులుగారు తమకుతామై కోరి, యీ పాటలు చక్కగా అచ్చువేయించినందుకు వారికి చదువరులతోబాటు నేనును కృతజ్ఞుడను.

ఈ కృతి నర్పించినది నా పెత్తల్లి కుమారునకు. నా తండ్రి నాకు నాలుగైదేండ్లున్నప్పుడు కాలంచేస్తే, అప్పటినుండి యిప్పటివరకు మా కందరకు అతడే పట్టుకొమ్మ. ‘‘చంద్రున కొక్కనూలిపోగ’’న్నట్లు అతనికీ కృతి సమర్పిస్తున్నాను.

మద్రాసు,

29–8–1925.

నండూరి వెంకటసుబ్బారావు

ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 05:38 AM