దేశవ్యాప్త కులగణనకు తెలంగాణ దిక్సూచి
ABN , Publish Date - May 07 , 2025 | 05:04 AM
‘ఇవాళ బెంగాల్ ఏం ఆలోచిస్తుందో... రేపు భారత దేశం అది ఆలోచిస్తుంది’ అనేది నిన్నటి ముచ్చట. తెలంగాణ ఆచరణను దేశం అనుసరిస్తుందనేది నేటి మాట. కుల గణన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా...
‘ఇవాళ బెంగాల్ ఏం ఆలోచిస్తుందో... రేపు భారత దేశం అది ఆలోచిస్తుంది’ అనేది నిన్నటి ముచ్చట. తెలంగాణ ఆచరణను దేశం అనుసరిస్తుందనేది నేటి మాట. కుల గణన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని నిర్ణయించినప్పుడు విపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ పెదవి విరిచాయి. కానీ అదే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రానున్న జన గణనలో కుల గణన కూడా చేపడతామని తాజాగా ప్రకటించింది.
భారత్ జోడో యాత్రలో దేశ ప్రజల ఆకాంక్షలను, ఆవేదనను ప్రత్యక్షంగా తెలుసుకున్న రాహుల్గాంధీ తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని హామీ ఇచ్చారు. జోడో యాత్ర అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది. రాహుల్గాంధీ వాగ్దానం మేరకు తెలంగాణలో కుల గణన చేపట్టాలని 2024 ఫిబ్రవరి 24న రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది. ప్రతి దశలోనూ పకడ్బందీగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వే పూర్తి చేసింది. రాష్ట్రంలోని 97.10 శాతం ఇళ్ల సర్వేలో మొత్తం తెలంగాణ జనాభా 3,55,50,759గా తేలింది.
సర్వేలో వెల్లడైన గణాంకాల ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానాలు చేసింది. ప్రభుత్వం కుల గణన ఫలితాలను విధానపరమైన నిర్ణయాలకు ప్రాతిపదిక చేసుకుంటుండడంతో తెలంగాణ ప్రజల నుంచి సానుకూలత వెల్లువెత్తడం మొదలైంది. దీంతో అప్పటిదాకా విమర్శలు గుప్పించిన వర్గాలు నెమ్మదిగా మౌనం వహించడం ప్రారంభించాయి. కుల గణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ, గణాంకాల ఆధారంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలంటూ ఢిల్లీ జంతర్మంతర్లో సైతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నినదించారు. ఈ దీక్షకు బీజేపీ, దాని మిత్రపక్షాలు మినహా దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంలో సైతం కదలిక వచ్చింది. ఫలితంగానే తాజా నిర్ణయం.
2021లో జనాభా లెక్కలు సేకరించాల్సి ఉన్నా బీజేపీ ప్రభుత్వం కరోనా వైరస్ను సాకుగా చూపి వాటిని పక్కనపెట్టింది. కానీ కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలోనే 2020లో బిహార్, 2021లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు నిర్వహించారు. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రయోజనాలకే బీజేపీ పెద్దపీట వేసింది. కానీ దేశంలో ప్రణాళికల రూపకల్పన, నిధుల కేటాయింపు వంటి కీలకాంశాలకు మూలమైన జన గణనపై పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణలో కుల గణన చేపట్టిన తర్వాత ఆ ప్రభావం ఇతర రాష్ట్రాలపైన పడడం... ఈ ఏడాది బిహార్, వచ్చే ఏడాది కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అకస్మాత్తుగా కుల గణన చేపడతామని ప్రకటించింది.
రాజకీయ విభేదాలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కసరత్తును, అనుసరించిన విధానాలను పాటించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంలో తెలంగాణ మోడల్ను అధ్యయనం చేయాలి. ‘‘గొప్ప ఆలోచనలు అన్ని వైపులా నుంచి రానివ్వాలి’’ అని చెబుతోంది రుగ్వేదం!
దూదిపాళ్ల విజయకుమార్
ముఖ్యమంత్రి పీఆర్వో
ఇవి కూడా చదవండి..
సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్సైజ్.. నోటీసు విడుదల చేసిన కేంద్రం
India Pak War: యుద్ధం పరిష్కారం కానేకాదు.. భారత్కు ఐరాసా సూచన
Pakistan Army Chief: భారత్ దాడికి దిగితే.. పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మరిిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి