అరవై వసంతాల జగిత్యాల కళాశాల
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:03 AM
ఒక వ్యక్తికైనా, వ్యవస్థకైనా జన్మదినం జరుపుకోవడానికి ఆ జన్మకు ఒక ‘చరిత్ర’ ఉండాలి. అలాంటి చరిత్ర గల కళాశాల జగిత్యాల కళాశాల (ఎస్.కె.ఎన్.ఆర్. గవర్నమెంట్ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల). అది ఇప్పుడు 60 ఏళ్లు పూర్తి చేసుకుంది....
ఒక వ్యక్తికైనా, వ్యవస్థకైనా జన్మదినం జరుపుకోవడానికి ఆ జన్మకు ఒక ‘చరిత్ర’ ఉండాలి. అలాంటి చరిత్ర గల కళాశాల జగిత్యాల కళాశాల (ఎస్.కె.ఎన్.ఆర్. గవర్నమెంట్ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల). అది ఇప్పుడు 60 ఏళ్లు పూర్తి చేసుకుంది.
1965లో ఒక జూనియర్ కాలేజీ ఆవరణలోని రేకుల గదులలో డిగ్రీ కాలేజీగా ప్రారంభమైన కళాశాల అది. దాని గుర్తింపు కోసం ఉస్మానియా యూనివర్సిటీ ప్రముఖులతో ఒక ‘కమిషన్’ నియమించింది. వారితోపాటు పీవీ నరసింహారావు కూడా వచ్చారు. కమిషన్ సభ్యులు ఆవరణ చూసి నవ్వుతూ ముక్కుమీద వేలు వేసుకొని ‘‘ఇక్కడ డిగ్రీ కాలేజీ స్థాపిస్తారా, ఇంత తక్కువ వసతులతో’’ అన్నారు. దానికి పీవీ ‘‘తెలంగాణలో కాలేజీలన్నీ కూడా ఈ విధంగానే ప్రారంభమవుతున్నాయి, పెట్టుబడులు చేతకాక’’ అని జవాబిస్తూ ‘‘కరీంనగర్లో కూడా ఇలాంటి కాలేజే ఒక గోదాంలో స్థాపించాం. మామూలుగానే స్థాపించాం, కాని అది ఇప్పుడు ‘గైర్ మామూల్’ కాలేజీగా పేరుప్రతిష్ఠలు తెచ్చుకుంది... విశ్వనాథ సత్యనారాయణ, ఐ.వి.చలపతిరావు, ఎస్.ఎస్. బార్లింగే, వెల్చాల కొండలరావు వంటి పరిపాలకుల, ఆధ్యాపకుల వల్ల ఈ కళాశాల కూడా అలాగే పేరు తెచ్చుకుంటుంది, మీరు చూడండి! దీని వెనకాల కె.లక్ష్మీనరసింహారావు, వి.జగపతిరావు లాంటి దిగ్గజాలున్నారు, నేనూ ఉన్నాను’’ అని నొక్కి వక్కాణించారు. అది అలాగే పేరు తెచ్చుకుంది. దానికంటూ ఒక చరిత్ర సృష్టించుకుంది.
అనతికాలంలోనే ఆ కాలేజీ తగినన్ని వసతి సౌకర్యాలు సమకూర్చుకుంది. అంతకంటే మిన్నగా మంచి అధ్యాపకులు కూడా సమకూరారు. దాంతో దానికి మంచి కీర్తి లభించింది. విద్యార్థులకు, స్థానికులకు తృప్తి కలిగింది. ఎంత కీర్తి కలిగిందంటే కళాశాల జరుపుకునే కార్యక్రమాలకు స్థానికులైన ముఖ్యులు వచ్చి కూర్చొని, సరదాగా సాహిత్య, సాంస్కృతిక, విద్యా విషయక ఉపన్యాసాలు, చర్చాగోష్ఠులు వినేవారు. ఆ కళాశాలలో సదస్సులది, ఉపన్యాసాలది, గోష్ఠులది ప్రత్యేకత. ఎక్కడెక్కడి నుంచో వక్తలు వచ్చి మాట్లాడేవారు. విశ్వనాథ సత్యనారాయణ రాకవల్ల కరీంనగరానికి ఎలాంటి సాహిత్య సారస్వత వాతావరణం ఏర్పడిందో, అలాంటి వాతావరణం జగిత్యాల కళాశాల వల్ల జగిత్యాలకు ఏర్పడింది. ఆనాటి రోజుల గురించి అక్కడివారు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.
జగిత్యాల కళాశాల స్థాపనకు పూర్వం దాని పరిసర ప్రాంత విద్యాలయాలకు అంత క్రమశిక్షణ, ప్రతిష్ఠ ఉండేవి కాదు. ఆ కళాశాల స్థాపనతో అవన్నీ మారిపోయాయి. దానికి కారణం ప్రిన్సిపల్ కొండలరావు పరిపాలనా దక్షత. వారి పరిపాలన, క్రమశిక్షణ వల్ల కళాశాలలోని పాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాలు పకడ్బందీగా జరిగేవి. జగిత్యాలలోనే కాక కరీంనగర్ జిల్లాలోనూ, హైదరాబాదులో కూడా ఆ కళాశాల పేరుప్రతిష్ఠలు గడించింది. కారణం ఆ కళాశాలలో మంచి ఫలితాలు వచ్చేవి. ఈ కళాశాలలో చదివిన వారిలో జయప్రకాశ్, కడారు వీరారెడ్డి, అనుమాండ్ల భూమయ్య, మంగేరి రాజేందర్ (జింబో), గండ్ర లక్ష్మణరావు, డా. బి. నరేందర్రావు వంటివారు ఉన్నారు. చెప్పుకోదగిన అధ్యాపకులలో కోవెల సంపత్కుమారాచార్య, రాజిరెడ్డి, రామ్నారాయణ్, అప్పయ్యశాస్త్రి, వెంకటరావు, వెంకటరెడ్డి, ఎం.రాంచంద్రరావు వంటివారు ఎందరో ఉన్నారు.
ఆ రోజులలో జగిత్యాల కళాశాల గ్రంథాలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఒక విశ్వవిద్యాలయానికి సరిపోయేన్ని పత్రికలు, పఠనా సామగ్రి అందులో ఉండేది. ఆనాటి ఐఏఎస్ అధికారి వైద్యనాథ్ అయ్యర్ ఆ కళాశాల లైబ్రరీకి వచ్చి పుస్తకాలు, పత్రికలు చదివి సంబరపడి ‘ఇక్కడ ఇంత మంచి గ్రంథాలయమా?’ అని ఆశ్చర్యపోయారు. గున్నార్ మెరిడల్ రచించిన ‘ఏషియన్ డ్రామా’ అనే అత్యాధునిక పుస్తకం ఆ రోజులలోనే అక్కడ లభించేది. జగిత్యాల కళాశాల గ్రంథాలయ సౌకర్యాలను చూసి ఇతర కళాశాలలు తమ గ్రంథాలయాలను అభివృద్ధి చేసుకున్నాయి.
మరి అలాంటి చరిత్ర ఉన్న కళాశాల... జగిత్యాల కళాశాల! 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ కళాశాల జన్మదినోత్సవం జరుపుకుంటే అది స్ఫూర్తిదాయకమవుతుంది. ఒకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థాపించిన కళాశాలకు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉత్సవం జరపడానికి నిర్ణయం తీసుకోవాలని పూర్వ విద్యార్థుల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
బి. నాగభూషణం
పూర్వ విద్యార్థి, జగిత్యాల కళాశాల
ఇవి కూడా చదవండి..
కమాండర్ అభినందన్ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి