Share News

A New Era for Labor Laws: శ్రామిక చట్టాలకు నూతన శకం

ABN , Publish Date - Nov 28 , 2025 | 05:45 AM

మన దేశంలో 1930–50 మధ్య రూపొందించిన కార్మిక చట్టాలే నేటికీ అమలులో ఉన్నాయి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ప్రస్తుత తరానికి ఆ చట్టాలు సరిపోవు. ఈ నేపథ్యంలోనే...

A New Era for Labor Laws: శ్రామిక చట్టాలకు నూతన శకం

మన దేశంలో 1930–50 మధ్య రూపొందించిన కార్మిక చట్టాలే నేటికీ అమలులో ఉన్నాయి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ప్రస్తుత తరానికి ఆ చట్టాలు సరిపోవు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మన దేశంలో శ్రామిక చట్టాలకు కొత్త శకం ఆరంభమైంది. కేవలం చారిత్రక సంస్కరణ మాత్రమే కాదు, దేశంలోని ప్రతి శ్రామికుడికి గౌరవాన్ని, భద్రతను కల్పించే దిశగా ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఇప్పటి వరకు ఉన్న 29 పాత కార్మిక చట్టాలను సరళతరం చేస్తూ, దేశంలోని 40 కోట్ల మందికి పైగా కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత, గ్రాట్యుటీ వంటి కీలక ప్రయోజనాలకు హామీ లభిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయంతో కార్మికుల జీవితాల్లో వెలుగులు ప్రసరించనున్నాయి. నూతన చట్టాల వల్ల కీలక మార్పులతో అందరికీ సాంఘిక భద్రత చేకూరనుంది. అసంఘటిత రంగం, గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్‌ వర్కర్ల వంటి వర్గాలకు కూడా రక్షణ పొందే అవకాశం లభించింది.

ఇప్పటి వరకు అమల్లో ఉన్న కార్మిక చట్టాలను సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను ప్రకటించింది. వేతనాల కోడ్‌–2019, సామాజిక భద్రతా కోడ్‌–2020, పారిశ్రామిక సంబంధాల కోడ్‌–2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌–2020 ఇందులో ఉన్నాయి. ఇవి ఈ నెల 21 నుంచి అమల్లోకి వచ్చాయి. అన్ని రంగాలకూ ఇవి వర్తిస్తాయని, కార్మికుల భద్రత మెరుగుపర్చడానికి, అలసటను తగ్గించడానికే కాక భద్రత, అదనపు ప్రయోజనాలు లభిస్తాయని కేంద్రం చెబుతోంది. నూతన కార్మిక చట్టాలతో పరిశ్రమలకు సరళీకృత విధానాలు, పెట్టుబడులు, ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు పెరిగేలా వ్యవస్థను రూపొందించారు.

దేశంలోని 40 కోట్ల మంది, ముఖ్యంగా ఏపీలోని సంఘటిత, అసంఘటిత రంగాల్లోని లక్షలాది మంది కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత, గ్రాట్యుటీ వంటి కీలక ప్రయోజనాలు ఈ నూతన కార్మిక చట్టాలతో లభించనున్నాయి. తాజా కోడ్‌లలో మహిళలకు హక్కులు, భద్రతను మరింత పెంచడం, ప్రమాదకరమైన ప్రాసెసింగ్‌ కేంద్రాలు సహా, దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం, సింగిల్‌ రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌, రిటర్న్‌ వ్యవస్థలు ఏర్పాటు చేయడం వంటి ప్రధాన సంస్కరణలు ఉన్నాయి. ఈ నాలుగు స్మృతులతో ఉపాధిని సంఘటితం చేయడం, కార్మికుల సంరక్షణను బలోపేతం చేయడం, కార్మిక నిర్వహణ వ్యవస్థను సులభతరం, సురక్షితం చేయడంతో పాటు అంతర్జాతీయంగా అనుసంధానించవచ్చు.


కొత్త కార్మిక నియమావళి ప్రకారం అతిపెద్ద మార్పులలో ఒకటి: రోజువారీ పని పరిస్థితులు. ఉద్యోగులు ఎంతకాలం పనిచేస్తారు, వారు ఎప్పుడు వేతనంతో కూడిన సెలవులకు అర్హులు, వారు ఎంత ఓవర్ టైం తీసుకోవచ్చు, వారు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలకు అర్హులు... వంటివి ఈ వ్యవస్థ నిర్ణయిస్తుంది. ఇప్పటివరకు, ఉద్యోగులు వార్షిక వేతనంతో కూడిన సెలవుకు అర్హత సాధించడానికి ముందు ఒక క్యాలెండర్ సంవత్సరంలో 240 పని దినాలను పూర్తి చేయాల్సి ఉండేది. కొత్త కోడ్‌లు ఆ అవసరాన్ని 180 రోజులకు తగ్గించాయి. అంటే ఇప్పుడు ఒక కార్మికుడు ఏడాదిలో చాలా ముందుగానే సెలవుకు అర్హుడు అవుతాడు. ఇది తయారీ, వస్త్రాలు, రిటైల్, నిర్మాణం, హాజరు నియమాలు సంప్రదాయకంగా కఠినంగా ఉండే ఇతర రంగాలలోని వారికి పెద్ద మార్పు అని చెప్పవచ్చు. దీని వలన కార్మికులకు మరింత విశ్రాంతి దొరుకుతుంది. ఇది దీర్ఘకాలంలో ఉత్పాదకతతో పాటూ ఉద్యోగ సంతృప్తిని మెరుగుపరుస్తుంది.

కొత్త కోడ్‌ల ప్రకారం రోజుకు ఎనిమిది గంటలు, వారానికి 48 గంటలు పని చేయాలనే నియమం అలానే ఉంటుంది. కానీ వాటిని ఎలా ఏర్పాటు చేసుకోవచ్చనేది మాత్రం మారుతుంది. అంటే, దీనిని వారంలో నాలుగు రోజులు– 12 గంటలు, వారంలో అయిదు రోజులు– దాదాపు 9.5 గంటలు, వారంలో ఆరు రోజులు– రోజుకు ఎనిమిది గంటల కింద విభజించుకోవచ్చును. దీంతో పాటూ ఓవర్ టైమ్ పరిమితిని స్థానిక అవసరాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు సొంత పరిమితులను నిర్ణయించుకోవచ్చు.

కొత్త కోడ్‌లలో మరో ప్రధాన మార్పు– ఆరోగ్యం, వైద్య కవరేజ్. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఉద్యోగికి ఇప్పుడు ఉచిత వార్షిక ఆరోగ్య తనిఖీ లభిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ గంటలు, ప్రమాదకర వాతావరణం లేదా శారీరక ఒత్తిడి ఉండే రంగాలల్లోని కార్మికుల ఆరోగ్య సంరక్షణకు ఇది ఉపకరిస్తుంది. తోటల కార్మికులకు గతంలో ఒకే విధంగా అందుబాటులో లేని ESIC వైద్య సౌకర్యాలు ప్రస్తుతం అందుబాటులో ఉంటాయి.


ప్రతి కార్మికుడికీ గౌరవం కల్పించాలన్న ఎన్డీయే సర్కారు హామీతో కొత్త కార్మిక స్మృతులు దేశంలో అమల్లోకి వచ్చాయి. ఈ కోడ్‌లతో కార్మికులందరికీ కనీస వేతనాలు లభిస్తాయి, యువతకు నియామక పత్రాలు అందుతాయి. మహిళలకు సమాన వేతనం, గౌరవం లభిస్తుంది. 40 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుంది. ఫిక్స్డ్‌ టర్మ్‌ ఉద్యోగులకు ఏడాది పనిచేసిన తర్వాత గ్రాట్యుటీ వంటివి దక్కుతాయి. ఈ సంస్కరణలు సాధారణమైన మార్పులు కాదు. కార్మికుల సంక్షేమం కోసం ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద చర్య. స్వయం సమృద్ధ భారత్‌ దిశగా కీలక ముందడుగు. 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్‌గా నిలవాలన్న లక్ష్యానికి ఊతమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

వాసంశెట్టి సుభాష్

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం

మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 28 , 2025 | 05:45 AM