Lord Shiva: ఈ శివుడిని దర్శిస్తే దెబ్బకు మీ జాతకం మారాల్సిందే..
ABN , Publish Date - Feb 26 , 2025 | 10:37 AM
ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ ఆలయాలు చాలా ఉన్నాయి. అందులో ఈ ఆలయం మరింత స్పెషల్. శివుడు దక్షిణామూర్తిగా కొలువైన ఈ కొండపై కాకులు అస్సలు వాలకపోవడం విశేషం.

సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తూ ఉంటాయి. కానీ, గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలోని ఈ కోటప్ప కొండపై మాత్రం అస్సలు కాకులు వాలవు. కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా అక్కడ కనిపించదు. ఇప్పటి వరకూ ఈ కొండపై కాకులు వాలిన దాఖలాలు కూడా లేవు. అయితే, అసలు ఈ కొండపై కాకులు ఎందుకు వాలవు? వాలకపోవడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కోటప్ప కొండ చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి.
కోటప్ప కొండ చరిత్ర
మహా శివుడు కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తి అయిన శివుడిని దర్శించి తనకు జ్ఞాన బోధ చేయాలని కోరుతాడు. అందుకు పరమశివుడు బదులిస్తూ త్రికుటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెబుతాడు. దీంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్లి అక్కడ శివుడి నుండి జ్ఞానం పొందుతాడు. ఆ ప్రదేశమే పాత కోటప్ప కొండగా మారింది. కోటప్ప కొండను ఎటువైపు నుంచి చూసినా సరే మూడు శిఖరాలు కనిపిస్తాయి. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా అందరూ భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగా, ఇక్కడ కొలువైన స్వామిని త్రికుటాచలేశ్వరునిగా, త్రికోటేశ్వరుడిగా భక్తులు కొలుస్తారు.
అయితే, ఈ పర్వతాలకు సమీపంలోనే కొండకావూరులో సుందుడు అనే ఒక యాదవుడు తన భార్య కుందిరితో కలిసి అక్కడ జీవించేవాడు. సుందుడు ఒకరోజు పశువులను కాచుకుంటూ కొండపై ఉన్న త్రికుటేశ్వరున్ని దర్శించి సేవిస్తాడు. ఆ తరువాత సుందుడు భార్యకు గొల్లభామ అనే కుమార్తె జన్మిస్తుంది. ఆమె జన్మించిన తరువాత సుందుడు కుటుంబం సిరి సంపదలతో ఎదుగుతుంది.
ఈ కొండపై కాకులు వాలవు..
గొల్లభామ చిన్నతనం నుంచే పరమశివుడి పట్ల భయభక్తులు కలిగి ఉండేది. ఆమె రోజూ రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో పూజలు చేసేది. ఆమె భక్తిని పరీక్షించాలని శివుడు కన్య అయిన గొల్లభామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు. అయితే, ఆమె గర్భంతో ఉన్నప్పట్టికీ ఆ పరమేశ్వరున్ని కొలిచేందుకు పాత కోటప్ప కొండకు ప్రతి రోజూ వెళ్లేది. ఎప్పటిలానే ఒక రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్ల కుండలో పెరుగును తీసుకుని వెళ్తూ ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది. ఇంతలోనే ఒక కాకి ఆ కుండపై వాలి గొల్లభామ దగ్గర ఉన్న పెరుగును నేలపాలు చేస్తుంది. దీంతో గొల్లభామ తీవ్ర విచారంలో ఉంటుంది. ఆ సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఆ పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని చెబుతాడు. అప్పటి నుంచి ఈ కోటప్ప కొండపై కాకులు వాలడం లేదని పురాణం చెబుతుంది. ఇప్పటికీ కూడా అక్కడ కాకులు వాలవు అని స్థానికులు చెబుతారు.
అయితే, గర్భంతో గొల్లభామ కొండ ఎక్కలేకపోతు ఆయాసపడుతుంది. ఇక తాను కొండ ఎక్కలేకపోతున్నాని, నీవే కిందికి రావాలని ఆమె కోరడంతో పరమ శివుడు అందుకే సరే అంటాడు. కానీ, నీవు వెళ్లే దారిలో అస్సలు వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడు. అయితే, కొంత దూరం వెళ్లిన తర్వాత భీకరమైన శబ్ధాలు గట్టిగా వినిపించడంతో గొల్లభామ వెనక్కి తిరిగి చూస్తుంది. దీంతో శివుడు అక్కడే జంగందేవరకొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు. ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా మారింది.
కోటప్ప కొండ విశేషాలు ఏంటంటే..
మహాశివరాత్రి సందర్భంగా కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు అస్సలు ఉండవు. కాబట్టి, ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. పరమ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఏపీ రాష్ట్రంలో ఇదొక్కటే. ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని అంటారు. గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని చెబుతారు. అందుకే కోటప్ప కొండ వెళ్లి త్రికుటేశ్వరున్ని సేవించాలని అంటారు. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, ప్రకృతి అందాలు టూరిస్టులకు ఎంతో రమణీయంగా అనిపిస్తాయి.
Also Read:
ఈ శివాలయాన్ని దర్శిస్తే పిల్లలు పుడతారంట.. ఎక్కడుందో తెలుసా..
ఈ రసం తాగితే ఉపవాసం ఉన్నా ఫుల్ ఎనర్జిటిక్గా ఉంటారు..