Nikki Bhati Dowry Death: నోయిడా వివాహిత హత్య కేసులో కొత్త కోణం.. భర్త ఎఫైర్ బట్టబయలు
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:54 PM
గ్రేటర్ నోయిడా వివాహిత హత్య కేసులో తాజాగా కీలక వివరాలు వెలుగు చూశాయి. మృతురాలి భర్త ఓ సందర్భంలో మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వారి కుటుంబంలో ఎంతో కాలంగా గొడవలు ఉన్నట్టు ఇరుగు పొరుగు వారు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: గ్రేటర్ నోయిడాలో వివాహిత హత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మృతురాలు నిక్కీ భాటీ భర్త విపిన్ భాటీకి గతంలో ఓ మహిళతో సంబంధం ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
నిక్కీ వివాహం 2018లో జరిగింది. ఇక విపిన్ సోదరుడు రోహిత్ వివాహం నిక్కీ సోదరి కాంచన్తో జరిగింది. ఇదిలా ఉంటే, నిక్కీ తరచూ తన భర్త చేతిలో వరకట్న వేధింపులకు గురయ్యేదని నిక్కీ తండ్రి తెలిపారు. ఈ వేధింపుల కారణంగా ఓసారి ఆమె తన సోదరితో కలిసి పుట్టింటికి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆగస్టు 21న నిక్కీ దారుణ హత్యకు గురైంది. ఆమెకు నిప్పు పెట్టిన హత్య చేసిన నేరంపై విపిన్, అతడి కుటుంబసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ క్రమంలో విపిన్ ఎఫైర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. గతంలో ఓసారి విపిన్ మరో మహిళతో ఉండగా నిక్కీ, కాంచన్లకు దొరికిపోయాడు. అయితే, తన తప్పు లేదని నిరూపించుకునేందుకు ఆ మహిళపై విపిన్ దాడి చేయగా బాధితురాలు కేసు పెట్టింది. అయితే, విపిన్ కుటుంబంలో మొదటి నుంచీ గొడవలు జరుగుతూ ఉండేవని ఇరుగుపొరుగు వారు తెలిపారు. నిక్కీపై వేధింపులకు సంబంధించి కొన్ని వీడియోలను ఆమె సోదరి స్వయంగా బయటపెట్టింది.
ఇక నిక్కీ, ఆమె సొదరి బ్యూటీ పార్లర్ నిర్వహించే వారని స్థానికులు అన్నారు. ఈ సందర్భంగా మేకప్కు సంబంధించిన ఫొటోలు నెట్టింట పోస్టు చేసేవారు. దీనిపై విపిన్, రోహిత్ ఇద్దరూ అభ్యంతరం వ్యక్తం చేసేవారని తెలిసింది.
అయితే, వరకట్న వేధింపులే తన కూతురి హత్యకు దారి తీశాయని నిక్కీ తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటన వెనకాల సోషల్ మీడియా కోణం లేదని అన్నారు. విపిన్కు ఖరీదైన కారు, డబ్బును కట్నంగా ఇచ్చామని చెప్పారు. అత్తింటి వారు అడుగుతున్నారంటూ తన కూతురు పలుమార్లు డబ్బు తీసుకెళ్లిందని తెలిపారు. ఇటీవల ఓసారి మళ్లీ ఆ కుటుంబంలో కలతలు రేగాయని అన్నారు. చివరకు తన కూతుళ్లు ఇద్దరూ పుట్టింటికి వచ్చారని, అత్తింటివారు మళ్లీ క్షమాపణలు చెప్పాకే తిరిగి వెళ్లారని తెలిపారు.
‘నా కూతురికి నిప్పు పెట్టి వారంతా పారిపోయారు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూసింది. ఆమెకు 70 శాతం కాలిన గాయాలు అయ్యాయి. నా కూతురిని కోల్పోయాను. ఇక నాకు ఏమీ మిగలలేదు’ అని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇవి కూడా చదవండి
భార్యను హీరోయిన్లా మార్చేందుకు బలవంతంగా కసరత్తులు.. మహిళకు అబార్షన్
టీచర్ కొట్టారన్న కోపంతో తుపాకీతో కాల్పులు..
For More Crime News and Telugu News