Hotel Booking Scam: ఆన్లైన్లో హోటల్ గది బుక్ చేద్దామని ప్రయత్నిస్తే ఊహించని షాక్
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:34 PM
ఆన్లైన్లో లగ్జరీ హోటల్ గది బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. ఫేక్ వెబ్ సైట్తో అతడిని మోసగించిన ఓ నిందితుడు ఏకంగా 33 వేలు కాజేశాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి వెనక ముఠా ఏదైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: గోవాలో ఓ లగ్జరీ స్పా రిసార్ట్లో గది బుక్ చేద్దామనుకున్న వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. ఏకంగా 33 వేల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి గోవాలోని LaLiT గోల్ఫ్ అండ్ స్పా రిసార్ట్లో గది బుక్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ అనే యువకుడు తనని తాను రిసార్ట్ మేనేజర్నని చెప్పుకుని బాధితుడికి కాల్ చేశాడు. బుకింగ్కు ముందస్తు నగదు చెల్లించాలని అన్నాడు. దీనికి అంగీకరించిన బాధితుడు.. షారుఖ్ ఖాన్ అడిగిన మేరకు రూ.33 వేలను ఏక మొత్తంగా యూపీఐ ద్వారా చెల్లించాడు. ఆ తరువాత షారుఖ్ ఖాన్ ఫోన్లో స్పందించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి డిజిటల్ లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాల ఆధారంగా అతడి జాడ కనుక్కుని అదుపులోకి తీసుకున్నారు. అమాయకులను బురిడీ కొట్టించేందుకు నిందితుడు లగ్జరీ హోటళ్ల ఫేక్ వెబ్ సైట్లు ఏర్పాటు చేసేవాడని తెలిపారు. వీటిల్లో భారీ డిస్కౌంట్లు ప్రకటించి కస్టమర్లను ముగ్గులోకి దింపేవాడు. తాను హోటల్ సిబ్బందిలో ఒకరినని నమ్మిస్తూ డబ్బులు వసూలు చేసేవాడు. ఆ తరువాత బాధితులకు కనీసం ఫోన్లో అందుబాటులో లేకుండా మాయమైపోయేవాడు.
అమాయకులను మోసం చేసేందుకు అతడు పక్కాగా ప్లాన్ చేసేవాడని పోలీసులు తెలిపారు. హోటల్ గది బుక్ అయినట్టు ఈమెయిల్స్, టెక్స్ట్ మెసేజీలు వంటివన్నీ పంపించి డబ్బులు దోచుకుపోయేవాడని అన్నారు. గొప్ప భాషా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ బాధితుల వద్ద డబ్బు దోచుకునే వాడని అన్నారు. షారుఖ్ ఒంటరిగా ఇదంతా చేసినప్పటికీ అతడి వెనక ఏదైనా బడా ముఠా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రియుడి మోజులో వివాహిత దారుణం.. మంచానపడ్డ భర్తను కిరాతకంగా హత్య
ఢిల్లీలో సీరియల్ కిల్లర్ అరెస్టు.. 24 ఏళ్ల తరువాత పట్టుకున్న పోలీసులు