Share News

Stock Market: నష్టాల నుంచి కాస్త ఉపశమనం.. స్టాక్ మార్కెట్లకు లాభాల కళ..

ABN , Publish Date - Jan 14 , 2025 | 10:39 AM

సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు కాస్త కోలుకుంటున్నాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు సాగించడంతో సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు సాగిస్తుండడం విశేషం.

Stock Market: నష్టాల నుంచి కాస్త ఉపశమనం.. స్టాక్ మార్కెట్లకు లాభాల కళ..
Stock Market

సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు కాస్త కోలుకుంటున్నాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు సాగించడంతో సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు సాగిస్తుండడం విశేషం. బ్యాంక్, ఆటో, ఎనర్జీ రంగ షేర్లలో కొనుగోళ్లు సాగుతున్నాయి. ముఖ్యంగా అదానీ షేర్లలో కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 290 పాయింట్ల లాభంలో ఉంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే లాభాలు అందుకుంటోంది (Business News).


సోమవారం ముగింపు (76, 330)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి వెళ్లింది. 400 పాయింట్లకు పైగా లాభపడి 76, 779వ గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10: 30 గంటల సమయంలో 290 పాయింట్ల లాభంతో 76, 621 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే లాభాలతో రోజును ప్రారంభించింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో 78 పాయింట్ల లాభంతో 23, 164 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు లాభాల బాటలో సాగుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, యునైటెడ్ స్పోర్ట్స్, ఏంజెల్ వన్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 691 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 534 పాయింట్ల లాభంలో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.54గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 14 , 2025 | 10:39 AM