Share News

Stock Market: వరుస నష్టాల నుంచి ఉపశమనం.. సెన్సెక్స్ 740 పాయింట్లు జంప్..

ABN , Publish Date - Mar 05 , 2025 | 03:57 PM

కెనడా, మెక్సికోలపై అమెరికా విధించిన 25 శాతం సుంకాలను తగ్గించనుండడం, ఆసియా మార్కెట్ల ర్యాలీ పాజిటివ్ సెంటిమెంట్‌ను పెంచాయి. దీంతో దేశీయ సూచీలలో కూడా లాభాల కళ కనిపించింది. ఈ లాభాలతో సెన్సెక్స్ మళ్లీ 73, 500 పైకి ఎగబాకింది.

Stock Market: వరుస నష్టాల నుంచి ఉపశమనం.. సెన్సెక్స్ 740 పాయింట్లు జంప్..
Stock Market

వరుస నష్టాలతో కుదేలైన దేశీయ సూచీలకు బుధవారం కాస్త ఉపశమనం లభించింది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. కెనడా, మెక్సికోలపై అమెరికా విధించిన 25 శాతం సుంకాలను తగ్గించనుండడం, ఆసియా మార్కెట్ల ర్యాలీ పాజిటివ్ సెంటిమెంట్‌ను పెంచాయి. దీంతో దేశీయ సూచీలలో కూడా లాభాల కళ కనిపించింది. ఈ లాభాలతో సెన్సెక్స్ మళ్లీ 73, 500 పైకి ఎగబాకింది. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఏకంగా రెండు శాతం పెరిగాయి. (Business News).


మంగళవారం ముగింపు (72, 989)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో దాదాపు 100 పాయింట్లు పెరిగి 73, 933 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 740 పాయింట్ల లాభంతో 73, 730వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. ఏకంగా 254 పాయింట్ల లాభంతో 22, 337 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ, కోఫోర్జ్ లిమిటెడ్ షేర్లు లాభాలను ఆర్జించాయి. బీఎస్‌ఈ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, వోల్టాస్ షేర్లు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1160 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 244 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.95 గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 05 , 2025 | 03:57 PM