మరింత సరళంగా మ్యూచువల్ ఫండ్ నిబంధనలు సెబీ
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:36 AM
మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) నిబంధనలను మదుపరులు, ఇండస్ట్రీ వర్గాలకు మరింత సరళంగా మార్చేందుకు సమగ్ర సమీక్ష జరుపుతున్నట్లు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ...
మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) నిబంధనలను మదుపరులు, ఇండస్ట్రీ వర్గాలకు మరింత సరళంగా మార్చేందుకు సమగ్ర సమీక్ష జరుపుతున్నట్లు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఆధ్వర్యంలో జరిగిన 17వ మ్యూచువల్ ఫండ్ సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ రంగ నియంత్రణ నిబంధనలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని, మారుతున్న మదుపరుల అవసరాలు, ఇండస్ట్రీ ఆవిష్కరణలకు అనుగుణంగా వాటిని సరళీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఇండస్ట్రీ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు త్వరలోనే ముసాయిదా నిబంధనలను విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. తదనంతరం తుది నిబంధనలను జారీ చేయడం జరుగుతుందన్నారు. గడిచిన కొన్నేళ్లలో భారత మ్యూచువల్ ఫండ్ రంగం శరవేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. ప్రస్తుతం దేశంలోని అన్ని ఫండ్ల పథకాల నిర్వహణలోని మొత్తం ఆస్తులు రూ.72 లక్షల కోట్లకు చేరుకోగా.. క్రమానుగుత పెట్టుబడి పథకాల్లో (సిప్)కి నెలవారీగా వచ్చే నిధులు రూ.28,000 కోట్ల స్థాయికి పెరిగాయి. అయితే, 140 కోట్లకు పైగా జనాభా కలిగిన మన దేశంలో మ్యూచువల్ ఫండ్ మదుపరులు కేవలం 5 కోట్లేనని మనోజ్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు.
ఇవీ చదవండి:
సేవింగ్స్ అకౌంట్లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి
మరోసారి మైక్రోసాఫ్ట్లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి