SBI 2047 Target: 2047 నాటికి జీడీపీలో 25 శాతం ఆస్తులు లక్ష్యం
ABN , Publish Date - Oct 06 , 2025 | 05:09 AM
అభివృద్ధి కోసం ప్రభుత్వ రంగంలోని అతి పెద్ద బ్యాంక్ ఎస్బీఐ భారీ లక్ష్యాలను పెట్టుకుంది. ఇందుకోసం ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని నిర్ణయించింది. ‘వికసిత్ భారత్’ సాధనకు నిర్దేశించుకున్న...
టాప్-20 గ్లోబల్ బ్యాంకుల్లోనూ చోటు
ఎస్బీఐ చీఫ్ చల్లా శ్రీనివాసులు శెట్టి
న్యూఢిల్లీ: అభివృద్ధి కోసం ప్రభుత్వ రంగంలోని అతి పెద్ద బ్యాంక్ ఎస్బీఐ భారీ లక్ష్యాలను పెట్టుకుంది. ఇందుకోసం ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని నిర్ణయించింది. ‘వికసిత్ భారత్’ సాధనకు నిర్దేశించుకున్న లక్ష్యం 2047 నాటికి దేశ జీడీపీలో తమ బ్యాంకు ఆస్తులను 25 శాతానికి పెంచుకోవాలని భావిస్తున్నట్టు ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులుశెట్ట్టి తెలిపారు. ఎన్పీసీఐ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం దేశ జీడీపీలో ఎస్బీఐ ఆస్తుల వాటా 20 శాతం వరకు ఉంది. ఆస్తుల పరంగా ప్రస్తుతం ప్రపంచంలోని టాప్-50 బ్యాంకుల్లో ఎస్బీఐ 43వ స్థానంలో ఉంది. 2047 నాటికి ఆస్తి-అప్పుల పట్టీని (బ్యాలెన్స్ షీట్) మరిం త మెరుగుపరుచుకుని ప్రపంచంలోని టాప్-10 లేదా టాప్-20 బ్యాంకుల జాబితాలో స్థానం సంపాదిస్తామన్నారు. ‘‘ప్రస్తు తం దేశ జీడీపీలో మా ఆస్తుల వాటా 20 శాతం వరకు ఉంది. 2047 నాటికి దీన్ని 25 శాతానికి అంటే జీడీపీలో నాలుగో వంతుకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పటికి ప్రపంచంలోని టాప్-10 లేదా టాప్-20 బ్యాంకుల్లోనూ స్థానం సంపాదిస్తాం’ అని శ్రీనివాసులు శెట్టి చెప్పారు.
కొత్త రంగాలకు రుణ మద్దతు: సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజెన్, బ్యాటరీ స్టోరేజి వంటి నూతన వ్యా పార రంగాలపై కంపెనీలు, ప్రభు త్వం దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఎస్బీఐ చీఫ్ చెప్పారు. ఇలాంటి కొత్త ప్రాజెక్టులకు తమ రుణ మద్దతు ఉంటుందన్నారు. ఇందుకోసం ఆయా పరిశ్రమ వర్గాల తో సమన్వయం కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. సరికొత్త రంగాలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎంతో తోడ్పడనున్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరికి ఎస్బీఐ ఆస్తి-అప్పుల పట్టి (బ్యాలెన్స్ షీట్) రూ.66 లక్షల కోట్లు దాటిందని చెప్పారు.
అంతర్జాతీయంగానూ ఆసరా : విదేశీ మార్కెట్లలో ఎదగాలనుకునే భారత కంపెనీలకు సైతం ఎస్బీఐ మద్దతు కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం తమ బ్యాంకు కు 29 దేశాల్లో 240 పైగా శాఖలు ఉన్న విషయాన్ని శ్రీనివాసులు శెట్టి గుర్తు చేశారు. ఈ శాఖల ద్వారా భారత కంపెనీల ఎగుమతుల వృద్ధి, విదేశీ రుణ సేకరణకు అవసరమైన సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం తమ ఆస్తి-అప్పుల పట్టిలో విదేశాల్లోని శాఖల వాటా 10 శాతం వరకు ఉందన్నారు. ముందు ముందు దీన్ని 12 నుంచి 13 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి