Senior Citizen Savings Scheme: స్థిర ఆదాయానికి భరోసా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:31 AM
దేశంలో వడ్డీ రేట్లు పడిపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రెపో వడ్డీ రేటు ఒక శాతం తగ్గించింది. దీంతో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీ రేట్లు కుదిస్తున్నాయి. ఇలాంటి...
దేశంలో వడ్డీ రేట్లు పడిపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రెపో వడ్డీ రేటు ఒక శాతం తగ్గించింది. దీంతో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీ రేట్లు కుదిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్ల పరిస్థితి ఏంటి? స్థిర ఆదాయం కోసం వారు వేటిని ఆశ్రయిస్తే మంచిది. ఆ వివరాలు మీకోసం..
జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో వచ్చే నెలలో జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) భేటీలో ఆర్బీఐ కీలక రెపో వడ్డీ రేటును మరింత తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లు మరింత తగ్గించడం ఖాయం. ఇప్పటికే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తప్ప ఏ బ్యాంక్ కూడా సీనియర్ సిటిజన్లతో పాటు ఎవరికీ వారి ఎఫ్డీలపై 8 శాతానికి మించి వడ్డీ చెల్లించడం లేదు.
ఏమిటి మార్గం?
వడ్డీ రేట్లు తగ్గుతున్న ఈ పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎ్సఎస్) ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ పథకం కింద చేసిన డిపాజిట్లపై 8.2 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నారు. పోస్టాఫీసుల్లో పొదుపు ఖాతా ఉన్న వారికి ఈ ఎస్.సి.ఎస్.ఎస్. అందుబాటులో ఉంటుంది. లేదంటే కొత్తగా ఖాతా తెరవవచ్చు. అయితే ఈ వడ్డీ రేటును ప్రభుత్వం అక్టోబరు 1 నుంచి సవరించే అవకాశం ఉంది. అయినా బ్యాంక్ ఎఫ్డీలతో పోలిస్తే ఎస్సీఎ్సఎస్ సురక్షితమైన, స్థిర ఆదాయ పెట్టుబడి అని చెప్పవచ్చు.
అర్హతలు
ఎస్సీఎ్సఎస్ అందరికీ వర్తించదు. 60 సంవత్సరాలు నిండిన భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రత్యేక లేదా సాధారణ వీఆర్ఎస్ తీసుకున్న వ్యక్తులు, రిటైర్ అయిన సైనిక సిబ్బంది వయస్సు 60 ఏళ్ల కంటే తక్కువ ఉన్నా.. ఈ పథకానికి అర్హులే.
వడ్డీ చెల్లింపు
ఎస్సీఎ్సఎస్ డిపాజిట్లపై వడ్డీని మూడు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తారు. దీనివల్ల సీనియర్ సిటిజన్లకు మార్కెట్ ఆటుపోట్లతో సంబంధం లేకుండా స్థిరమైన ఆదాయం అందుతుంది.
భద్రత
ఎస్సీఎ్సఎస్.. బ్యాంక్ ఎఫ్డీల కంటే సురిక్షితమైనది. ఎందుకంటే ఈ పథకం అసలు, వడ్డీ చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. అందుకే జీవిత చరమాంకంలో ఉన్న పండుటాకులకు, ఇది అత్యంత భద్రతతో కూడిన పెట్టుబడిగా చెబుతారు.
అకౌంట్ క్లోజింగ్
ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు. కావాలంటే మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. పాస్బుక్, అప్లికేషన్ ఫారం పూర్తి చేసి పోస్టాఫీ్సలో ఇస్తే.. అప్పటి వరకు మన ఖాతాలో జమ అయిన మొత్తాన్ని ఖాతాదారుడికి చెల్లిస్తారు.
ముందే మరణిస్తే?
ఒకవేళ ఖాతాదారుడు మెచ్యూరిటీకి ముందే మరణిస్తే.. చనిపోయిన తేదీ నుంచి పోస్టాఫీస్ పొదుపు ఖాతాపై చెల్లించే వడ్డీ రేటు చెల్లిస్తారు. చనిపోయిన వ్యక్తి ఎస్సీఎ్సఎస్ ఖాతా తెరిచేటప్పుడే జీవిత భాగస్వామిని జాయింట్ హోల్డర్ లేదా నామినీగా పేర్కొంటే పథకం మెచ్యూరిటీ వరకు అదే వడ్డీ రేటు కొనసాగుతుంది.
పెట్టుబడుల పరిమితి
ఈ పథకంలో ఏటా కనీసం రూ.1,000, గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు మదుపు చేయవచ్చు. అదే పదవీ విరమణ చేసిన వారయితే తమ రిటైర్మెంట్ మొత్తం లేదా రూ.30 లక్షలు.. ఇందులో ఏది తక్కువైతే దాన్ని పెట్టుబడిగా ఆమోదిస్తారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిన నెల రోజుల్లోపే ఈ పెట్టుబడి పూర్తి చేయాలి.
పన్ను ప్రయోజనాలు
ఎస్.సి.ఎస్.ఎస్. డిపాజిట్లపై ఆదాయ పన్ను (ఐటీ) చట్టం కింద పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ పథకంలో ఏటా చేసే డిపాజిట్లలో రూ.1.5 లక్షల వరకు సెక్షన్ 80సీ కింద ఆదాయ మినహాయింపు లభిస్తుంది. వడ్డీ ఆదాయానికి మాత్రం ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. అయితే సెక్షన్ 80 టీటీబీ కింద సీనియర్ సిటిజన్లు వడ్డీ ఆదాయంలోనూ రూ.50,000 వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
సిద్ధరామయ్య, డీకే ప్రత్యేక అధికారుల మధ్య బాహాబాహీ
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి