Share News

ఎగిసి పడిన మార్కెట్‌

ABN , Publish Date - Jun 25 , 2025 | 04:11 AM

స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో ట్రేడైనప్పటికీ ఆద్యంతం భారీ ఊగిసలాటలకు లోనయ్యాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు...

ఎగిసి పడిన మార్కెట్‌

సెన్సెక్స్‌ లాభం 160 పాయింట్లకే పరిమితం

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ ఉల్లంఘనతో అప్రమత్తం

ముంబై: స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో ట్రేడైనప్పటికీ ఆద్యంతం భారీ ఊగిసలాటలకు లోనయ్యాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడం, ఫలితంగా ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు సెన్సెక్స్‌, నిఫ్టీ ఉదయం సెషన్‌లో ర్యాలీ తీశాయి. సెన్సెక్స్‌.. మధ్యాహ్నానికల్లా 1,121.37 పాయింట్ల వరకు ఎగబాకి 83,018.16 వద్ద ఇంట్రా డే గరిష్ఠాన్ని నమోదు చేసింది. కానీ, కథ ఇక్కడే అడ్డం తిరిగింది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ కొద్ది గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమై పెద్దఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దాంతో సెన్సెక్స్‌ ఇంట్రాడే లాభం అంతా చేజారగా కేవలం 158.32 పాయింట్ల వృద్ధితో 82,055.11 వద్ద ముగిసింది. నిఫ్టీ 72.45 పాయింట్ల పెరుగుదలతో 25,044.35 వద్ద స్థిరపడింది. మరిన్ని విషయాలు..

  • బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2.2 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.450.08 లక్షల కోట్లకు (5.23 లక్షల కోట్ల డాలర్లు) చేరింది.

  • విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) నికరంగా రూ.5,266.01 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) మాత్రం రూ.5,209.60 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.

  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 73 పైసలు పెరిగి రూ.86.05 వద్ద ముగిసింది. రూపాయికి గత ఐదేళ్లలో ఇదే అతి పెద్ద ఒక్క రోజు లాభం.

  • అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడాయిల్‌ పీపా రేటు ఒకదశలో 3.19 శాతం క్షీణించి 69.20 డాలర్ల వద్దకు జారుకుంది.

  • ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.900 తగ్గి రూ.98,900 వద్దకు జారుకోగా.. కిలో వెండి సైతం రూ.1,000 తగ్గి రూ.1,04,200 స్థాయికి దిగివచ్చింది.


చమురు ప్రభావిత షేర్లు జూమ్‌

ముడిచమురు ధరలు బాగా తగ్గడంతో ఆయిల్‌ మార్కెటింగ్‌, ఎయిర్‌లైన్స్‌, పెయింట్ల తయారీ సంస్థ ల షేర్లు పుంజుకున్నాయి. బీఎ్‌సఈలో హెచ్‌పీసీఎల్‌ షేరు 3.24 శాతం ఎగబాకగా.. ఐఓసీ 2.04 శాతం, బీపీసీఎల్‌ 1.92 శాతం పెరిగాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ స్టాక్‌ 2.55 శాతం, స్పైస్‌జెట్‌ 2.15 శాతం వృద్ధి చెందాయి.

వొడాఫోన్‌ ఐడియాకు భారీ ఊరట!?

ఆర్థికంగా దివాలా స్థితిలో ఉన్న వొడాఫోన్‌ ఐడియాకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. కంపెనీ చెల్లించాల్సిన రూ.84,000 కోట్ల ఏజీఆర్‌ (సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం) బకాయిలకు గడువును ప్రస్తుతమున్న 6 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచే అవకాశాలున్నాయని ఓ ఆంగ్ల మీడియా కథనం పేర్కొంది. ఈ వార్త నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా షేరు 4.89 శాతం ఎగబాకి రూ.6.87 వద్ద ముగిసింది.


మూడు ఐపీఓలకు సెబీ ఆమోదం

ఎలకా్ట్రనిక్స్‌ బజార్‌ మాతృసంస్థ జీఎన్‌జీ ఎలకా్ట్రనిక్స్‌, లాజిస్టిక్‌ సేవలందించే గ్లోట్టిస్‌, ఫార్మా కంపెనీ అమంత హెల్త్‌కేర్‌ ఐపీఓ ప్రతిపాదనలకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది.

మరో విడత ఈసాప్స్‌ బైబ్యాక్‌

డార్విన్‌బాక్స్‌

శాన్‌ఫ్రాన్సిస్కో/హైదారాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టెక్నాలజీ సేవలందించే డార్విన్‌బాక్స్‌ కంపెనీ మరో విడత ఈసాప్స్‌ బైబ్యాక్‌ పూర్తి చేసింది. ఈ బైబ్యాక్‌ కింద కంపెనీ ఉద్యోగుల నుంచి రూ.86 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. ఈసాప్స్‌ కింద ఉద్యోగులకు కేటాయించిన షేర్ల ను డార్విన్‌బాక్స్‌ కంపెనీ బైబ్యాక్‌ చేయడం గత నాలుగేళ్లలో ఇది మూడోసారి. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి చెందిన వివిధ కేంద్రాల్లో పని చేస్తున్న 350 మందికి పైగా ఉద్యోగులు ప్రయోజనం పొందినట్టు తెలిపింది. కంపెనీ అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులకు ఆ ప్రయోజనం అందాలనే తమ సంకల్పానికి ఇది నిదర్శనమని డార్విన్‌బాక్స్‌ కంపెనీ సహ వ్యవస్థాపకులు జయంత్‌ పాలేటి ఒక ప్రకటనలో తెలిపారు.

ఇవీ చదవండి:

హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్‌ తట్టుకోగలదా

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 04:11 AM