ఐఫోన్ల ఎగుమతుల్లో చైనాను దాటిన భారత్
ABN , Publish Date - May 29 , 2025 | 02:30 AM
భారత్ నుంచి అమెరికాకు ఐఫోన్ల ఎగుమతులు చైనాను మించిపోయాయి. మార్కెట్ పరిశోధక సంస్థ ఓండియా (గతంలో క్యానలిస్) డేటా ప్రకారం.. గత నెలలో అమెరికాకు మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ల సరఫరా...
గతనెల 76 శాతం వృద్ధి
దాదాపు 30 లక్షల యూనిట్ల సరఫరా
న్యూఢిల్లీ: భారత్ నుంచి అమెరికాకు ఐఫోన్ల ఎగుమతులు చైనాను మించిపోయాయి. మార్కెట్ పరిశోధక సంస్థ ఓండియా (గతంలో క్యానలిస్) డేటా ప్రకారం.. గత నెలలో అమెరికాకు మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ల సరఫరా వార్షిక ప్రాతిపదికన 76 శాతం వృద్ధితో దాదాపు 30 లక్షల యూనిట్లకు పెరిగింది. అదే సమయంలో చైనా నుంచి అమెరికాకు ఐఫోన్ల ఎగుమతులు మాత్రం 76 శాతం తగ్గి 9 లక్షల యూనిట్లకు పడిపోయాయి. అమెరికాకు ఐఫోన్ల ఎగుమతుల విషయంలో భారత్ తొలిసారిగా చైనాను అధిగమించింది.
4 నెలల్లో 1.15 కోట్ల ఐఫోన్ల ఎగుమతులు
ఈ ఏడాదిలో గడిచిన నాలుగు నెలల్లో (జనవరి-ఏప్రిల్) భారత్ నుంచి అమెరికాకు 1.15 కోట్ల ఐఫోన్లు ఎగుమతయ్యాయి. అదే సమయంలో చైనా నుంచి 1.32 కోట్ల ఐఫోన్ల సరఫరా జరిగింది. నాలుగు నెలల కాలానికి చూస్తే, ఇప్పటికీ చైనానే అగ్రగామిగా ఉన్నప్పటికీ నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే భారత్ నుంచి సరఫరా భారీగా పెరుగుతూ వస్తోంది.
భారత్పై యాపిల్ ఫోకస్
ఐఫోన్ల తయారీ కోసం యాపిల్ కేవలం చైనా పైనే ఆధారపడకుండా భారత్ను ప్రత్యామ్నాయ వేదికగా ఎంచుకుంది. కరోనా సంక్షోభ కాలం నుంచే భారత మార్కెట్ నుంచి తన ఉత్పత్తుల సరఫరా కోసం భారీగా పెట్టుబడులు పెడుతూ వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు భారత్లోని తన థర్డ్ పార్టీ వెండార్ల నుంచి ఈ ఏడాది ఐఫోన్ల సేకరణను భారీగా పెంచింది.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్లో ఐఫోన్లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి