Stock Market Sensex Surges: మార్కెట్లో ఫెడ్ జోష్
ABN , Publish Date - Nov 27 , 2025 | 03:34 AM
దేశీయ స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. బుధవారం ట్రేడింగ్లో మదుపరులు కొనుగోళ్లు పోటెత్తించడంతో ఈక్విటీ సూచీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ ఏకంగా...
రేట్ల తగ్గుదల ఆశలతో పోటెత్తిన కొనుగోళ్లు
సెన్సెక్స్ 1,022 పాయింట్లు అప్
రూ.5.51 లక్షల కోట్ల సంపద వృద్ధి
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. బుధవారం ట్రేడింగ్లో మదుపరులు కొనుగోళ్లు పోటెత్తించడంతో ఈక్విటీ సూచీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ ఏకంగా 1,022.50 పాయింట్లు ఎగబాకి 85,609.51 వద్దకు చేరింది. నిఫ్టీ 320.50 పాయింట్ల వృద్ధితో 26,205.30 వద్ద స్థిరపడింది. ఆల్టైం రికార్డు ముగింపు స్థాయికి సూచీ కేవలం 10 పాయింట్ల దూరంలో ఉంది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వచ్చేనెలలో ప్రామాణిక వడ్డీరేట్లను మరింత తగ్గించవచ్చన్న అంచనాలు ఊపందుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన ఈక్విటీ సూచీలూ పరుగులు తీశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు, రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం త్వరలోనే కుదరవచ్చన్న అంచనాలు, ముడిచమురు ధరల తగ్గుదల వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్ను మరింత మెరుగుపరిచాయని విశ్లేషకులు పేర్కొన్నారు. బీఎ్సఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.5.51 లక్షల కోట్లు పెరిగి రూ.474.92 లక్షల కోట్లకు చేరింది.
సెన్సెక్స్లోని 30 కంపెనీల్లో భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ మినహా అన్నీ రాణించాయి. బజాజ్ ఫిన్సర్వ్ షేరు 2.63 శాతం వృద్ధితో సూచీ టాప్ గెయినర్గా నిలిచింది.
బీఎ్సఈ మిడ్క్యాప్ సూచీ 1.32ు, స్మాల్క్యాప్ ఇండెక్స్ 1.23ు వృద్ధి చెందాయి. రంగాలవారీ సూచీల్లో టెలికాం మినహా అన్నీ లాభపడ్డాయి.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎ్ఫఐఐ) రూ.4,778.03 కోట్లు, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐ) రూ.6,247.93 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
బంగారం.. 2 వారాల గరిష్ఠం
దేశీయంగా బంగారం ధరలు దాదాపు 2 వారాల గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9ు స్వచ్ఛత గల లోహం రేటు 10 గ్రాములపై రూ.1,200 పెరిగి రూ.1,30,100కు చేరింది. 99.5ు స్వచ్ఛత లోహం కూడా అదే స్థాయిలో పెరిగి రూ.1,29,500గా నమోదైంది. కిలో వెండి సైతం రూ.2,300 ఎగబాకి రూ.1,63,100 ధర పలికింది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ఒకదశలో 0.81ు వృద్ధితో 4,164 డాలర్లకు, సిల్వర్ 1.71ు పెరిగి 52.37 డాలర్లకు చేరాయి.
కెనరా బ్యాంక్ రూ.3,500 కోట్ల సమీకరణ
బాసెల్-3 ప్రమాణాలతో కూడిన అడిషనల్ టైర్-1 (ఏటీ1) బాండ్ల జారీ ద్వారా రూ.3,500 కోట్లు సమీకరించనున్నట్లు ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ బుధవారం ప్రకటించింది. మూలధన నిల్వలను పెంచుకోవడంతోపాటు భవిష్యత్ వృద్ధి ప్రణాళికలకు తోడ్పడేందుకు ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు బ్యాంక్ తెలిపింది.
రిలయన్స్: రూ.21 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ తొలిసారిగా రూ.21 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. బీఎ్సఈలో కంపెనీ షేరు ఒకదశలో 2 శాతానికి పైగా పెరిగి రూ.1,571.80 వద్ద సరికొత్త ఏడాది గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 1.99ు లాభంతో రూ.1,569.75 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.21,24,259.89 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిలయన్స్ షేరు 29 శాతానికి పైగా పెరిగింది.
ఎంసీఎక్స్ షేరు రూ.10,000
ఎంసీఎక్స్ షేరు ధర తొలిసారిగా రూ.10,000 మార్క్ను దాటేసింది. బీఎ్సఈలో షేరు ధర ఏకంగా 4.08ు వృద్ధి చెంది రూ.10,274.60 వద్ద ముగిసింది. ఈ షేరు లాభపడటం ఇది వరుసగా మూడో రోజు. ఈ ఏడాది మార్చిలో రూ.4,408 వద్ద ఏడాది కనిష్ఠాన్ని నమోదు చేసిన ఎంసీఎక్స్ షేరు.. గడిచిన 8 నెలల్లో 132ు శాతం వృద్ధి చెందడం విశేషం.
ఇవీ చదవండి:
డిసెంబర్లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!
మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్మెంట్పై అవగాహన కల్పించండి!