Electric Scooter Prices Hike: జనవరి 1 నుంచే ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెంపు.. !
ABN , Publish Date - Dec 23 , 2025 | 10:11 AM
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలని చూస్తున్న కొనుగోలుదారులకు ముఖ్య గమనిక. 2026 జనవరి నుంచి ధరలు పెరకబోతున్నాయి. ఇప్పటికే ఏథర్ కంపెనీ దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. మిగతా కంపెనీలు..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 23: వచ్చే ఏడాది నుంచి వివిధ కార్ల ధరలు పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటనలు చేస్తున్నాయి. ఇతర టూ-వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, వాహనాల తయారీ కంపెనీలు ధరల పెంపును ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తమ కస్టమర్లకు షాకిచ్చింది. తమ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెంచుతన్నట్లు ప్రకటన చేసింది.
కొత్త ఏడాది అంటే జనవరి 1, 2026 నుంచే పెంచిన ధరలు అమలులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.3 వేల వరకు పెంపు ఉంటుందని వెల్లడించింది. ముడి సరకు ధరలు పెరగడం, అంతర్జాతీయంగా కీలక ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు పెరగడం, ఫారెక్స్ ప్రభావం కారణంగా ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు ఏథర్ ఎనర్జీ కంపెనీ వెల్లడించింది. ధరల పెంపు ఒక్కో మోడల్ పై ఒక్కోలా ఉంటుందని కంపెనీ తెలిపింది.
అదే సమయంలో డిసెంబర్ స్కీమ్ ద్వారా ఎంపిక చేసిన పట్టణాలు, నగరాల్లో ఏథర్ స్కూటర్ కొనుగోళ్లపై రూ.20 వేల వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఏథర్ కంపెనీ 450 సిరీస్లో పెర్ఫార్మెన్స్ స్కూటర్లు, రిజ్తా పేరిట్ ఫ్యామిలీ స్కూటర్లు మార్కెట్లో ఉన్నాయి. ఆయా స్కూటర్ల ధరలు రూ. 1,14,546 నుంచి ప్రారంభమవుతున్నాయి. గరిష్ఠంగా ఈ స్కూటర్ల ధరలు రూ. 1,82,946 వరకు ఉన్నాయి.
ఇవీ చదవండి: