Share News

Kurnool crime: ఐదుసార్లు తప్పించుకొని ఆరోసారి బలి

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:37 AM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవ వరుడి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Kurnool crime: ఐదుసార్లు తప్పించుకొని ఆరోసారి బలి

  • సర్వేయర్‌ హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి

  • భర్త తేజేశ్వర్‌ బైక్‌కు జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చిన ఐశ్వర్య

  • దాని ఆధారంగా అతని లొకేషన్‌ వివరాలు సుపారీ ముఠాకు!

  • ఇప్పటికే పోలీసుల అదుపులో ఎనిమిది మంది నిందితులు?

కర్నూలు క్రైం/గద్వాల క్రైం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవ వరుడి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రియుడిపై మోజుతో తన భర్త తేజేశ్వర్‌ను చంపడానికి సిద్ధమైన ఐశ్వర్య.. అతని బైకుకు జీపీఎస్‌ ట్రాకర్‌ను ఏర్పాటు చేసి, లొకేషన్‌ వివరాలను ఎప్పటికప్పుడు సుపారీ ముఠాకు అందజేసినట్టు తెలిసింది. అంతేకాదు.. పెళ్లయిన నెల రోజుల వ్యవధిలో ఐదుసార్లు వారి హత్యాయత్నాల నుంచి తప్పించుకున్న తేజేశ్వర్‌ ఆరోసారి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గంటవీధి కాలనీకి చెందిన ప్రైవేటు సర్వేయర్‌ తేజేశ్వర్‌కు (32) కర్నూల్లోని కల్లూరు ఎస్టేట్‌కు చెందిన ఐశ్వర్యతో మే 18న వివాహం జరిగింది. అయితే.. అప్పటికే ఆమెకు కర్నూలులో తన తల్లి పనిచేసే బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తిరుమలరావుతో సంబంధం ఉంది. అతను వివాహితుడు అయినప్పటికీ పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో గతంలో ఒకసారి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడని.. అప్పుడు అతడి భార్య తీవ్రంగా గొడవ పెట్టుకుందని సమాచారం. ఆమె ససేమిరా అనడంతో ఐశ్వర్యను వెనక్కి పంపేశాడు.


ఆ తర్వాత కూడా వారి మధ్య సంబం ధం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఐశ్వర్యకు తేజేశ్వర్‌తో నిశ్చితార్థం జరిగి రద్దు అయింది. కానీ ఆమె ప్రియుడు తిరుమలరావుతో పాటు తేజేశ్వర్‌తో కూడా వాట్సాప్‌ చాట్‌ చేస్తూ ప్రేమాయణాన్ని కొనసాగించినట్టు తెలుస్తోంది. ఐశ్వర్య మాటలను నమ్మిన తేజేశ్వర్‌.. పెద్దలను ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక కూడా ఐశ్వర్య నిత్యం బ్యాంకు మేనేజర్‌తో చాటింగ్‌ కొనసాగించిందని.. ‘‘ఎలాగైనా తేజేశ్వర్‌ను వదిలించుకుని నీ దగ్గరకు వచ్చేస్తా’’ అని ప్రాధేయపడిందని సమాచారం. దీంతో అతడు తేజేశ్వర్‌ను హత్య చేసేందుకు కొంతమందికి రూ.75 వేల సుపారీ ఇచ్చాడు. అతని వద్ద డబ్బు తీసుకున్నవారిలో మనోజ్‌.. తేజేశ్వర్‌ను సర్వే పేరుతో బయటకు తీసుకెళ్లాడు. ముందస్తు ప్రణాళిక మేరకు.. పెబ్బేరు సమీపంలో అతన్ని హత్య చేశారు. మృతదేహాన్ని సమీపంలో పడేస్తే తెలిసిపోతుందని కర్నూలు వైపు వచ్చారు. పాణ్యం సమీపంలో పిన్నాపురం క్రాస్‌ రోడ్డు వద్ద గాలేరి నగరి కాల్వ మీదుగా వెళ్లి అక్కడ మృతదేహాన్ని పడేశారు. ఆ మరుసటి రోజు గద్వాల పోలీసులు కేసు నమోదు చేసి రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఆ తర్వాత పాణ్యం పోలీసులు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు తిరుమలరావు. మృతుడి భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, మనోజ్‌, సహకరించిన ఇద్దరు, కారు డ్రైవర్‌, మధ్యవర్తిత్వం వ్యవహరించిన మరొకరిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Jun 24 , 2025 | 03:37 AM