చిన్నారులపై చిత్రహింసలు
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:14 AM
మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమె పిల్లలను వైర్తో విచక్షణారహితంగా రక్తం తేలేటట్లు కొట్టాడు.

తల్లి కళ్లెదుటే బాలుడిని వైర్తో బాదిన ప్రియుడు
పట్టించుకోని తల్లి
ఇంటి నుంచి బయటకు పరుగు తీసిన బాలుడు
స్థానికులు గమనించి తల్లి, ఆమె ప్రియుడికి దేహశుద్ధి
పోలీసులకు ఫిర్యాదు
జంగారెడ్డిగూడెంలో అమానుషం
ఏలూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): జంగారెడ్డిగూడెం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమె పిల్లలను వైర్తో విచక్షణారహితంగా రక్తం తేలేటట్లు కొట్టాడు. బాలుడు కేకలు వేస్తూ బయటకు పరుగు తీయడంతో స్థానికులు స్పందించి మహిళ, యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడితో పాటు అతడి చెల్లెలి ఒంటిపై గాయాలు స్థానికులను కలచి వేశాయి. పట్టణంలోని సుబ్బంపేటలో శనివారం రాత్రి గానాల శారద (శశి) తొమ్మిదేళ్ల కుమారుడు రాహుల్ను ఆమె ప్రియుడు నల్ల వెలుగుల పవన్ విద్యుత్ వైర్తో విచక్షణా రహి తంగా కొట్టాడు. బాధ తట్టుకోలేక రాహుల్ బయటకు పరుగులు తీశాడు. రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లి అంకుల్ నన్ను కాపాడు అంటూ భోరున ఏడుస్తూ అడిగాడు. ఆ వెంటనే పవన్, శారద వచ్చి ఇది మా ఇంట్లో గొడవ మీకెందుకు అని ప్రశ్నించి రాహుల్ను తీసుకు వెళ్లడానికి ప్రయత్నించారు. గాయాలతో ఉన్న రాహుల్ను చూసి ఇంటి చుట్టు పక్కల వారు చలించిపోయారు. పవన్, శారదలపై ఆగ్రహంతో వారిద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థ లానికి చేరుకున్న పోలీసులు బాలుడు రాహుల్, అతడి చెల్లెలు రేణుకను ఆసుపత్రికి తరలిం చారు. పవన్ అక్కడి నుంచి పరారయ్యాడు.
తల్లి కళ్లెదుటే హింసించినా..
ఆస్పత్రిలో శనివారం రాత్రి బాలలకు వైద్య సేవలందించి ఆదివారం ఉదయం వారిని ప్ర శ్నించగా విచారించగా చిత్రహింసలను ఏకరువు పెట్టారు. ప్రతీరోజు రాత్రి ఇంట్లో పవన్ మద్యం సేవిస్తూ తల్లి కళ్లెదుటే రాహుల్, రేణుకను సెల్ఫోన్ వైర్తో విచక్షణారహితంగా కొట్టేవాడు. కన్నతల్లి ఏమాత్రం పవన్ను వారించేదికాదు. కొంతకాలంగా మాట వినడంలేదంటూ పవన్తో పాటు శారద కూడా పిల్లలను కొట్టేది. గట్టిగా అరుస్తున్నారని నోట్లో గుడ్డలు కుక్కి కూడా కొట్టేవారు. కొంత కాలం క్రితం రాహుల్ నోటిపై గట్టిగా కొట్టడంతో పళ్లు ఊడిపోయాయి. ఆ బాఽఽధలో ఉన్న బాలుడి నోట్లో పచ్చి మిరపకాయ పెట్టి రాక్షసానందం పొందారు. బాలిక రేణుకను 20 రోజుల క్రితం సెల్ఫోన్ చార్జర్ వైర్తో పవన్ గట్టిగా కొట్టడంతో ఎడమ కంటిపై తీవ్రగాయ మైంది. బాలిక ఒళ్లంతా మానిన గాయాల మచ్చ లతో నిండిపోయింది. శారద, పవన్ పిల్లలిద్దరినీ క్రూరంగా చిత్రహింసలు పెట్టారు. గాయాలకు చికిత్స చేశామని ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ బేబీకమల తెలిపారు.
కలెక్టర్ సీరియస్
చిన్న పిల్లలను క్రూరంగా హింసించడంపై కలెక్టర్ వెట్రిసెల్వి సీరియస్ అయ్యారు. ఏరియా ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ బేబీకమల, ఐసీడీఎస్ సీడీపీవో పి.బ్యూలాతో ఫోన్లో మాట్లాడి పిల్లల పరిస్థితిని అడిగి తెలుసుకు న్నారు. పిల్లలకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఆసుపత్రి వైద్యులు, ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో చిన్నారులను ఉంచాలని ఆదేశించారు. బాధిత చిన్నారులను డీసీహెచ్ఎస్, ఐసీడీఎస్ పీడీ, శిశు సంరక్షణ అధికారులు, డీఎస్పీ, సీఐ పరామర్శించారు.
భర్తతో విడిపోయి..
కామవరపుకోట మండలం తాడిచర్లకు చెంది న గానాల శారద (శశి)కు తాడేపల్లిగూడెం వద్ద ఉన్న కూనవరం గ్రామానికి చెందిన గానాల గణేశ్తో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఉదయ రాహుల్, జశిత రేణుక ఇద్దరు పిల్లలు. కొంతకాలం తర్వాత గణేశ్ మద్యానికి బానిసై భార్యా పిల్లలను పట్టించుకోకపోవడంతో శారద భర్తను విడిచిపెట్టి పిల్లలతో తాడిచర్లలో తల్లి వద్ద ఉంటుంది. అదే గ్రామంలో గ్రామ వలంటీ రుగా పనిచేసే నల్లవెలుగుల పవన్తో శారదకు పరిచయం ఏర్పడింది. దాదాపు ఐదేళ్ల నుంచి వారు సహజీవనం చేస్తున్నారు. శారద తమ్ము డికి పెళ్లి అయ్యే వరకు కొంతకాలం బయట ఉండాలని తల్లిదండ్రులు చెప్పారు. దీనితో శారద పిల్లలను తీసుకుని జంగారెడ్డిగూడెం సుబ్బం పేటలోని నేతాజీ నగర్లో అద్దె ఇంట్లో ఉం టోంది. ఆమె ప్రియుడు పవన్ కూడా వాళ్లతోనే ఉంటున్నాడు. పవన్, శారద ఇద్దరూ వేర్వేరు హోటళ్లలో పనిచేస్తున్నారు.
కాగా ఈ సంఘటనపై బాలుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డీఎస్పీ యు. రవిచంద్ర తెలిపారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.