త్రిసభ్య కమిటీలు సిద్ధం
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:31 AM
సహకార సంఘాల్లో త్రిసభ్య కమిటీల ఏర్పాటుకు జాబి తాలు సిద్ధమయ్యాయి. జిల్లా నుంచి ప్రభుత్వానికి నివేదికలు వెళ్లాయి. మూడు పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య పంపకాలు జరిగాయి.
అభ్యర్థుల పేర్లతో అధిష్ఠానానికి చేరిన జాబితా
122 సహకార సంఘాలకు త్వరలోనే నియామకం
టీడీపీ నియోజకవర్గాల్లో 70 శాతం ఈ పార్టీకే
జనసేన నియోజకవర్గాల్లో చెరిసగం..
బీజేపీకి చోటు కల్పించేందుకు నిర్ణయం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
సహకార సంఘాల్లో త్రిసభ్య కమిటీల ఏర్పాటుకు జాబి తాలు సిద్ధమయ్యాయి. జిల్లా నుంచి ప్రభుత్వానికి నివేదికలు వెళ్లాయి. మూడు పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య పంపకాలు జరిగాయి. సంక్రాంతి నాటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆశించారు. జాబితాలు వెళ్లడం లో జాప్యం జరగడంతో నియామకపు ఆదేశాలు రాలేదు. జిల్లాలో 122 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిల్లో జనసేన ఎమ్మెల్యేలు వున్న భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం నియోజకవర్గాల్లో 50 శాతం టీడీపీకి, 50 శాతం జనసేనకు కేటాయించారు. జనసేనకు ఇచ్చిన సహకార సంఘాల్లోనే ఒకటి బీజేపీకి ఇవ్వనున్నారు. టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు, ఉండి, ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో 70 శాతం ఆ పార్టీకి, 30 శాతం జనసేనకు దక్కాయి. ఇందులో కొన్ని బీజేపీకి ఇవ్వనున్నారు. మూడు పార్టీలు సంప్రదింపుల తో సర్దుబాటు చేసుకున్నారు. కమిటీ అధ్యక్షునిగా ఎంపిక చేయాలంటూ కూటమి నేతలపై ఒత్తిడి పెరిగింది. చివరి నిమిషం వరకు కొన్ని సంఘాల్లో ఉత్కంఠకు దారితీసింది. ఇతర నియోజకవర్గాలు, రాష్ట్ర స్థాయి నేతలు సిఫారసులు చేశారు. ఫలితంగా త్రిసభ్య కమిటీల్లో పేర్లను ప్రతిపాదిం చడంపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు మల్లగుల్లాలు పడ్డారు. అధ్యక్షునిగా టీడీపీ ఉన్న సొసైటీల్లో జనసేన నుంచి ఒక సభ్యునికి అవకాశం ఇచ్చారు. జనసేన అధ్యక్షునిగా ఉన్న సహకార సంఘాల్లో టీడీపీ తరపున ఒక సభ్యుని పేరును సిఫారసు చేశారు.
నీటి సంఘాల్లో అవకాశం పొందిన నాయకులకు, సిఫా రసు చేసిన కేడర్కు సహకార సంఘాల్లో ప్రాతినిధ్యం లభిం చలేదు. కొత్తవారికి చోటు కల్పించారు. రైతులు, సభ్యత్వాలు, పార్టీల పట్ల విధేయత, కేడర్ను దృష్టిలో ఉంచుకుని కసరత్తు చేశారు. అధిష్ఠానానికి జాబితాలు పంపారు. త్వరలోనే నియా మకపు ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ త్రిసభ్య కమిటీలు ఆరు నెలలపాటు పనిచేస్తాయి.