VVIT: ఘనంగా వీవీఐటీ స్నాతకోత్సవం
ABN , Publish Date - Jun 20 , 2025 | 05:55 AM
గుంటూరు సమీపం నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీవీఐటీ) కళాశాల స్నాతకోత్సవం గురువారం ఘనంగా జరిగింది.
11 మంది విద్యార్థులకు బంగారు పతకాలు
1195 మందికి డిగ్రీలు ప్రదానం చేసిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధుమూర్తి
పెదకాకాని, జూన్ 19(ఆంధ్రజ్యోతి): గుంటూరు సమీపం నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీవీఐటీ) కళాశాల స్నాతకోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఉత్తమ ప్రతిభ కనబరచిన 11 మంది విద్యార్థులకు బంగారు బంగారు పతకాలు, 1195 మంది పట్టభద్రులకు డిగ్రీలను రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి ప్రదానం చేశారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మధుమూర్తి మాట్లాడుతూ డిగ్రీ అంటే కేవలం పట్టా మాత్రమే కాదని, జ్ఞానాన్ని సముపార్జించడమని తెలిపారు. ఐటీ, హెల్త్కేర్, ఆక్వా రంగాల్లో ప్రభుత్వం అనేక అవకాశాలను కల్పిస్తోందన్నారు.
స్టార్టప్ కంపెనీలను స్థాపించి ఉద్యోగాలను అందించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని సూచించారు. విజన్ 2047లో యువత ముఖ్య భూమిక వహించాలన్నారు. చాన్సలర్ విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉత్తమ పౌరులుగా ఎదిగి సమాజానికి తమవంతు సహాయం అందించాలని సూచించారు. వీసీ కొడాలి రాంబాబు మాట్లాడుతూ, 2007లో ప్రారంభమైన కళాశాల అనతికాలంలోనే అనేక విజయాలను సొంతం చేసుకుని 2025లో విశ్వవిద్యాలయంగా ఎదిగిందని తెలిపారు. వీవీఐటీ ప్రిన్సిపల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి కళాశాల వార్షిక ప్రణాళికను భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.
కార్యక్రమంలో వీవీఐటీ వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్, సెక్రటరీ ఎస్.బదిరి ప్రసాద్, జాయింట్ సెక్రటరి మామిళ్లపల్లి శ్రీకృష్ణ, డీన్ ఆఫ్ అకడమిక్ కె.గిరిబాబు, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.