గోడౌన్ లేక.. నిల్వ చేసుకోలేక..
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:02 AM
Without a Godown... Unable to Store భామినిలో ఎట్టకేలకు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా పంటను నిల్వ చేసుకునేందుకు గోడౌన్ సదుపాయం లేకపోవడంతో అటు సిబ్బంది.. ఇటు రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు.

భామిని, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): భామినిలో ఎట్టకేలకు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా పంటను నిల్వ చేసుకునేందుకు గోడౌన్ సదుపాయం లేకపోవడంతో అటు సిబ్బంది.. ఇటు రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. కొద్ది రోజుల కిందట భామిని ఏఎంసీలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడే ఉన్న వేర్హౌసింగ్లో రైతుల నుంచి సేకరించిన పత్తిని నిల్వ చేసుకునేవారు. అయితే స్టాక్ను అక్కడ ఉంచేందుకు వీలు లేదని, కొనుగోలు కేంద్రాన్ని కూడా తరలించాలని వేర్ హౌసింగ్ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో అక్కడున్న స్టాక్ను రామభద్రపురం మిల్లుకు తరలించారు. స్థానికంగా ఉన్న రైతు సేవా కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో వేర్ హౌసింగ్ గోడౌన్ వరండాలో ఉన్న కొంత స్టాక్ను రామభద్రపురానికి తరలిస్తున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత గోడౌన్ ఏర్పాటు చేస్తేనే పత్తిని కొనుగోలు చేస్తామని సీసీఐఎల్ అధికారి అతుల్తెండర్వినాథ్ తెలిపారు. ఇప్పటివరకు 900 క్వింటాళ్లను కొనుగోలు చేశామన్నారు. రెండు, మూడు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ అవుతుందన్నారు.