MLC Elections ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం
ABN , Publish Date - Feb 23 , 2025 | 11:59 PM
Preparation for MLC Elections జిల్లాలో ఈ నెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు సమాయత్తం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. పోలింగ్ నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

పార్వతీపురం, ఫిబ్రవరి23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు సమాయత్తం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. పోలింగ్ నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుందన్నారు. 2,333 మంది ఓటర్లుగా నమోదవగా... ఇందులో పురుషులు 1574 మంది, మహిళలు 759 మంది ఉన్నట్టు చెప్పారు. అత్యధికంగా పార్వతీపురంలో 636, పాలకొండలో 301, సాలూరులో 250 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అత్యల్పంగా పాచిపెంటలో 34 మంది ఓటర్లు ఉన్నట్టు వెల్లడించారు. జిల్లాలో 15 మండలాల్లో జరిగే పోలింగ్ కోసం ఇప్పటికే 18 మంది ప్రిసైడింగ్ అధికారులు, 18 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 36 మంది ఇతర పోలింగ్ అధికారులు, 18 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్టు తెలిపారు. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే పీవోలు, ఏపీవోలకు తొలి విడత శిక్షణ ఇచ్చామన్నారు. పోలింగ్ ముందురోజున పార్వతీపురం కలెక్టరేట్లోని డిస్ర్టి బ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఉంటుందన్నారు. చెక్లిస్ట్ మేరకు వాటిని పరిశీలించుకోవాల్సిన బాధ్యత పీవోలదేనని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ తీసుకెళ్లేందుకు అనుమతి లేనందున సెల్ఫోన్ డిపాజిట్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.