బొబ్బిలిలో భారీ చోరీ
ABN , Publish Date - Feb 02 , 2025 | 11:08 PM
బొబ్బిలి మున్సిపాలిటీ పరిధి చినబజార్ వీధిలో నివాసముంటున్న గ్రంథి రవికుమార్ ఇంట్లో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది.
- రూ.20లక్షల నగదు, 40 తులాల బంగారం అపహరణ
బొబ్బిలి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మున్సిపాలిటీ పరిధి చినబజార్ వీధిలో నివాసముంటున్న గ్రంథి రవికుమార్ ఇంట్లో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. రూ.20లక్షల నగదు, 40 తులాల బంగారాన్ని దొంగలు అపహరించారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రవికుమార్ తన నివాస సమీపంలో జ్యూయలర్ షాప్ నిర్వహిస్తున్నాడు. కుంభమేళాకు వెళ్లేందుకు శనివారం సాయంత్రం విశాఖపట్నంలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆయన భార్య వారం కిందటే విశాఖలోని తన పుట్టింటికి వెళ్లింది. వచ్చేవారం అంతా కలిసి కుంభమేళాకు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో దొంగలు చోరీకి తెగబడ్డారు. తలుపులను బద్దలుకొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.20 లక్షల నగదు, బీరువా లాకర్లో పెట్టిన 40 తులాల బంగారాన్ని దోచుకుపోయారు. ఆదివారం ఉదయం ఇంటి పని మనిషి వచ్చి చూడగా తలుపులు బార్లగా తెరిచి ఉండడంతో ఎదురుగా ఉన్న ఓ షాపు యజమానికి విషయం తెలియజేసింది. ఆయన రవికుమార్కి ఫోన్ చేశాడు. వెంటనే రవికుమార్ వైజాగ్ నుంచి ఇంటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ భవ్యరెడ్డి, పట్టణ సీఐ కె.సతీష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలను సేకరించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.