అరకొరగానే..
ABN , Publish Date - Feb 02 , 2025 | 11:15 PM
జిల్లాలో రేషన్ కార్డుదారులకు కందిపప్పు అరకొరగా పంపిణీ జరుగుతుంది. కేవలం 16 శాతం కార్డుదారులకే సరఫరా చేశారు. మిగిలివారికి అందకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
-పూర్తిగా పంపిణీ చేయని కందిపప్పు
- జిల్లాలో 16 శాతం రేషన్కార్డుదారులకే సరఫరా
- మిగిలిన వారికి నిరాశే
విజయనగరం,కలెక్టరేట్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్ కార్డుదారులకు కందిపప్పు అరకొరగా పంపిణీ జరుగుతుంది. కేవలం 16 శాతం కార్డుదారులకే సరఫరా చేశారు. మిగిలివారికి అందకపోవడంతో నిరాశ చెందుతున్నారు. బయట మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150కి కొనుగోలు చేయాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 5.80లక్షల రేషన్కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు ప్రతినెలా పంపిణీ చేసేందుకు 580 మెట్రిక్ టన్నుల కంది పప్పు అవసరం. కానీ, ఈ నెల కేవలం 98 మెట్రిక్ టన్నులే వచ్చింది. దీంతో 16 శాతం మంది కార్డుదారులకే కంది పప్పును అందించారు. మిగిలివారికి కేవలం బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తున్నారు. రేషన్ డిపోల ద్వారా కిలో కందిపప్పును రూ.67కే కార్డుదారులకు అందుతుంది. బయట మార్కెట్లో కిలో రూ.150 పైబడి విక్రయిస్తున్నారు. దీంతో ఈ ధరకు పప్పును కొనుగోలు చేయలేక కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ కందిపప్పు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు. దీనిపై పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మీనాకుమారి మాట్లాడుతూ.. ‘జిల్లాకు ఫిబ్రవరిలో కందిపప్పు ఎలాట్మెంట్ లేదు. ప్రస్తుతం ఉన్న 98 మెట్రిక్ టన్నుల కందిపప్పును రేషన్ డిపోలకు పంపించాం.’ అని వెల్లడించారు.