In-Charges? ఇన్చార్జిలతో ఇంకెన్నాళ్లు?
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:33 PM
How Much Longer with In-Charges? జిల్లాలో తహసీల్దార్ల కొరత నెలకొంది. కొన్నేళ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తుండడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి మండలానికి కచ్చితంగా తహసీల్దార్ ఉండాలి. కానీ జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇక్కడా పరిస్థితి లేదు.

ప్రజలకు పూర్తిస్థాయిలో అందని సేవలు
పార్వతీపురం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తహసీల్దార్ల కొరత నెలకొంది. కొన్నేళ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తుండడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి మండలానికి కచ్చితంగా తహసీల్దార్ ఉండాలి. కానీ జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇక్కడా పరిస్థితి లేదు. క్షేత్రస్థాయి సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పగిస్తుండడంతో వారు సక్రమంగా పనిచేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా మండలాల్లో రెవెన్యూ సమస్యలు కొలిక్కిరావడం లేనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. ఇందులో ఐదు మండలాలకు పూర్తిస్థాయి తహసీల్దార్లు లేరు. కొమరాడ, బలిజిపేటకు ఇన్చార్జి తహసీల్దార్లుగా అక్కడి హెచ్డీటీలు కె.శివయ్య, కె.రత్నకుమారి వ్యవహరిస్తున్నారు. మక్కువ, జియ్యమ్మవలస, వీరఘట్టం మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా చోట్ల ఉన్న హెచ్డీటీలు షేక్ ఇబ్రహీం, ఆర్.ఫకీరు, సి.హెచ్.సత్యనారాయణ తహసీల్దార్లుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇన్చార్జిల పాలనతో ప్రజలకు పూర్తిస్థాయిలో రెవెన్యూ సేవలు అందడం లేదు. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించి తగు చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.