murder ఆస్తి కోసం నాన్నను చంపేశాడు
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:14 AM
He killed his father for property జిల్లా కేంద్రంలోని గాజులరేగలో ఈ నెల 12న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కన్న కొడుకే కాలయముడైనట్లు గుర్తించారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు. టూటౌన్ పోలీసు స్టేషన్లో మీడియాకు డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆదివారం ఆ వివరాలను వెల్లడించారు.

ఆస్తి కోసం నాన్నను చంపేశాడు
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
విజయనగరం క్రైం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి):
జిల్లా కేంద్రంలోని గాజులరేగలో ఈ నెల 12న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కన్న కొడుకే కాలయముడైనట్లు గుర్తించారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు. టూటౌన్ పోలీసు స్టేషన్లో మీడియాకు డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆదివారం ఆ వివరాలను వెల్లడించారు.
గాజులరేగ రాజవీధికి చెందిన కరణపు సూరిబాబు ఈ నెల 12న హత్యకు గురయ్యాడు. దీనిపై టూటౌన్ పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తుండగా మృతుడు భార్య కరణపు బంగారు లక్ష్మీ భర్త మృతిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేసింది. దీంతో టూటౌన్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ మురళీ దర్యాప్తును వేగవంతం చేశారు. సూరిబాబు పోస్టుమార్టం రిపోర్టును వైద్యుల నుంచి సేకరించి ఆ రిపోర్టు ఆధారంగా సూరిబాబు తనయుడు కరణపు సాయిని అదుపులోకి తీసుకుని విచారించారు. తానే తండ్రిని చంపేసినట్టు నేరం అంగీకరించాడు. తామున్న ఇంటి విషయంలో కొన్నాళ్లుగా తగాదా నడుస్తోందని తెలిపాడు. ఈ నెల 12న మద్యం సేవించి ఇంటికి వచ్చానని, ఇంటిని అమ్మి డబ్బులు ఇమ్మని తండ్రిపై ఒత్తిడి తెచ్చినా వినలేదని, తండ్రిని తొలగిస్తే ఇళ్లు అమ్ముకోవచ్చు అనుకుని తండ్రికి మద్యం పట్టించి బలంగా కొట్టానని, దీంతో ఆయన మృతి చెందాడని విచారణలో వివరించాడు. నిందితుడు సాయిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని, అతని వద్ద నుంచి మెటల్ ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు.