తండ్రిని చంపేశాడు
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:31 AM
విజయనగరంలోని గాజులరేగ పరిధిలో గురువారం ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో తండ్రిని కుమారుడు బలంగా కొట్టడంతో తండ్రి మృతి చెందినట్టు తెలుస్తోంది.

విజయనగరం క్రైం ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని గాజులరేగ పరిధిలో గురువారం ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో తండ్రిని కుమారుడు బలంగా కొట్టడంతో తండ్రి మృతి చెందినట్టు తెలుస్తోంది. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజులరేగలోని రాజవీధిలో నివాసం ఉంటున్న కరణఫు సూరిబాబు(45) తన కుమారుడు సాయి ప్రతి రోజు ప్లాస్టిక్ బాటిల్స్ సేకరించి వాటిని విక్రయించి జీవనం గడుపు తుంటారు. సూరిబాబు తీరు నచ్చకపోవడంతో తన భార్య బంగారు లక్ష్మి కొన్నేళ్లుగా వేరుగా ఉంటుంది. తండ్రి కొడుకులు వచ్చిన డబ్బులతో మద్యం సేవించి నిత్యం గొడవలు పడుతుంటారు. జులాయిగా తిరుగుతున్న కుమారుడు గురువారం తండ్రితో ఘర్షణ పడ్డారు. దాంతో కుమారుడు సాయి.. తండ్రిని బలంగా కొట్టడంతో సూరిబాబు మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని టూటౌన్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ మురళి పరిశీలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.