పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:18 AM
గ్రామాల్లో పాడి రైతుల ఆర్థికా భివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ అన్నారు.

సీతానగరం, జనవరి24(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పాడి రైతుల ఆర్థికా భివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ అన్నారు. శుక్రవారం కృష్ణరాయపురంలో ఆయన పశు ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల్లో పాడి రైతులకు ఊతమిచ్చేలా గోకులాల షెడ్లు మంజూరు చేస్తోందని తెలిపారు. పశు కిసాన్ రుణ కార్డులను అందజేసి లక్షా అరవై వేల వరకు ఎటువంటి పూచీకత్తులు లేకుండా పశు పోషణ నిర్వహణ, పశుగ్రాసాలు కోసం జీరో వడ్డీతో రుణాలను అందిస్తోందని తెలిపారు. సహాయక సంఘ సభ్యులకు పశువుల కొనుగోలుకు సుమారు రూ.30వేలు సహాయాన్ని అందజేస్తున్నట్టు చెప్పారు. వెంకటసాగరం నుంచి రాంకోనేరు వరకు ఆక్రమణలు తొలగించి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. రెవెన్యూ, జల వనరుల శాఖ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి ఎస్.మన్మథరావు, ఎంపీపీ బలగ శ్రీరాములనాయుడు, జడ్పీటీసీ మామిడి బాబ్జీ, సర్పంచ్ అన్నంనాయుడు, తహసీల్దార్ ప్రసన్న కుమార్, ఎంపీడీవో త్రివిక్రమ్, పశు సంవర్థక శాఖ అధికారులు పాల్గొన్నారు.