road accident: పండగకు వచ్చి.. తిరిగి వెళ్తూ..
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:43 PM
road accident:సంక్రాంతి కోసం ఆయన తన భార్యాపిల్లలతో కలిసి స్వగ్రామం వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులంతా ఆనందం పండుగ జరుపుకొన్నారు.

రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు దుర్మరణం
భార్య, చిన్నకుమారుడికి తీవ్ర గాయాలు
సంక్రాంతి కోసం ఆయన తన భార్యాపిల్లలతో కలిసి స్వగ్రామం వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులంతా ఆనందం పండుగ జరుపుకొన్నారు. తిరిగి ద్విచక్ర వాహనంపై తన భార్యాపిల్లలను ఎక్కించుకుని నివాస ప్రాంతానికి బయలుదేరాడు. మరో ముప్పావు గంటలో ఇంటికి చేరుకుంటారనేలోగా లారీ రూపంలో మృత్యువు కబళించింది. బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో తండ్రీకుమారుడు దుర్మరణం చెందాడు. భార్య, చిన్న కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం స్వగ్రామంలో తెలియడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
పార్వతీపురం రూరల్/జియ్యమ్మవలస/రామభద్రపురం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండలం నర్సిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జియ్యమ్మవలస మండలం అల్లువాడకు చెందిన లోలుగు రాంబాబు (45), అతని పెద్ద కుమారుడు మోక్షశ్రీహాన్ (5) దుర్మరణం చెందారు. ఈ ఘటనలో రాంబాబు భార్య ఉమామహేశ్వరి, చిన్న కుమారుడు సూర్యశ్రీహాన్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. రాంబాబు బాడంగి మండలంలోని 108 వాహనంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ)గా గత పదేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. భార్య ఉమ పాచిపెంట మండలంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వీరు తమ ఇద్దరు కుమారులతో కలిసి విజయనగరం జిల్లా రామభద్రపురంలో నివాసం ఉంటున్నారు.
సంక్రాంతి పండుగ కోసం ఈ నెల 13న భోగి నాడు రాంబాబు తన భార్యా పిల్లలతో కలిసి స్వగ్రామం అల్లువాడ వచ్చాడు. అక్కడ తన తల్లిదండ్రులు లోలుగు అప్పలనాయుడు, అప్పమ్మ, తమ్ముడు మన్మథరావుతో కలిసి సంక్రాంతి జరుపుకున్నాడు. గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై తన భార్యా పిల్లలతో కలిసి రామభద్రపురానికి తిరుగు ప్రయాణమయ్యాడు. మరో ముప్పావు గంటలో ఇంటికి చేరుతారు అనుకునేలాలోగా పార్వతీపురం మండలం నర్సిపురం వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో రాంబాబు, అతని పెద్ద కుమారుడు మోక్షశ్రీహాన్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన భార్య ఉమ, చిన్న కుమారుడు సూర్యశ్రీహన్ను అంబులెన్స్లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఉమ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ గోవిందరావు తెలిపారు.
రెండుచోట్ల విషాదం
రాంబాబు, ఆయన కుమారుడు మోక్షశ్రీహాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి స్వగ్రామం అల్లువాడతో పాటు వారు నివాసం ఉంటున్న రామభద్రపురంలో విషాదచాయలు అలుముకున్నాయి. ‘మా ఆశలు ఆవిరైపోయాయి. మా చివరి కాలంలో మాకు తోడుగా ఉంటాడనుకున్న మా పెద్ద కొడుకు మాకు దూరమైపోయాడు. మాకు దిక్కెవరు.. దేవుడా ఇది నీకు న్యాయమా? అంటూ రాంబాబు తల్లిదండ్రులు రోదిస్తున్నారు. వారు ఏడుస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.