తోటివారికి సాయపడాలి
ABN , Publish Date - Feb 09 , 2025 | 12:09 AM
always ready to help తోటివారి కష్టసుఖాలను పంచుకోవడంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆన్నారు. మంగళపాలెంలోని గురుదేవ చారిటబుల్ ట్రస్టును ఆయన శనివారం సందర్శించారు.
తోటివారికి సాయపడాలి
కష్టసుఖాలను పంచుకోవడంలోనే అనందం
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
కొత్తవలస, ఫిబ్రవరి8 (ఆంధ్రజ్యోతి): తోటివారి కష్టసుఖాలను పంచుకోవడంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆన్నారు. మంగళపాలెంలోని గురుదేవ చారిటబుల్ ట్రస్టును ఆయన శనివారం సందర్శించారు. విజయశ్రీ ఉప్పలపాటి మెమొరియల్ క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించిన ఐసీయు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందజేశారు. వాటి తయారీ కేంద్రాన్ని సందర్శించి ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబును అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా థృక్పదాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. సేవ చేయడంలో ఉన్నంత సంతృప్తి, ఆనందం మరెందులోనూ దొరకదన్నారు. తోటివారి కష్ట సుఖాలను పంచుకోవడం భారతీయ హైందవ సంస్కృతిలోనే ఉందన్నారు. మతం అనేది వ్యక్తిగతమని, మన సంస్కృతి ప్రపంచం అంతా వ్యాప్తి చెందిందని చెప్పారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఇటువంటి బాధ్యతలను గురుదేవ చారిటబుల్ ట్రస్టు మోస్తోందని ప్రశంసించారు. క్యాన్సర్కు సంబంధించిన ఆసుపత్రులు గతంలో ఎక్కడో మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే ఉండేవని, ఇప్పుడు అన్నిచోట్లా అందుబాటులోకి వస్తున్నాయన్నారు. అనంతరం 35 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, 100 మంది వృద్ధులకు దుస్తులు అందజేశారు. ఇప్పటివరకు 2 లక్షల 50 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేసినట్టు ట్రస్టు చైర్మన్ జగదీష్బాబు తెలిపారు. ప్రముఖ క్రికెటర్ యువరాజ్ ఏర్పాటుచేసిన ఫౌండేషన్తో ఒప్పందం చేసుకున్న ప్రకారం క్యాన్సర్ రోగులకు సేవలను, స్ర్కీనింగ్ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ట్రస్టు వైస్ చైర్మన్ ఫణీంద్ర, వీయుఎంసీ ఆసుపత్రి సభ్యుడు రత్నాకర్ అధికారులు పాల్గొన్నారు.
చింతలపాలెం గ్రామస్థుల ఆప్యాయత బాగుంది
చింతలపాలెం గ్రామ ప్రజల అభిమానం, ఆప్యాయత చూసిన తరువాత గ్రామానికి మరోసారి రావాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం భీష్మ ఏకాదశమి పురస్కరించుకుని గ్రామంలో ఏర్పాటు చేసిన సాహిత్య గోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. తానా అవార్డు గ్రహీత ప్రముఖ సాహిత్యవేత్త బులుసు వెంటేశ్వర్లు శాస్ర్తి ఆధ్వర్యంలో సాహిత్యంపై చర్చ జరిగింది.
మాజీ ఉప రాష్ట్రపతిని కలిసిన మంత్రి
గంట్యాడ, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడును జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం కలిశారు. కొత్తవలస మండలం మంగళపాలెంలో గురుదేవ చార్టిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడును మంత్రికి కలిసి పుష్పగుచ్ఛం అందించారు. యువత రాజకీయల్లో రాణించి, ప్రజలకు చక్కని సేవలు అందించాలని మాజీ ఉపరాష్ట్రపతి సూచించారు.