అన్ని శాఖల సమన్వయంతో మహిళా దినోత్సవం
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:43 AM
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అన్ని శాఖల సమన్వయంతో ఈ నెల 8న ఘనంగా నిర్వహించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్గౌడ ఆదేశించారు.
ఘనంగా నిర్వహించాలని అధికారులకు జేసీ ఆదేశం
ఏర్పాట్లపై మంత్రి సంధ్యారాణి వీడియో కాన్ఫరెన్స్
పాడేరు, మార్చి 5(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అన్ని శాఖల సమన్వయంతో ఈ నెల 8న ఘనంగా నిర్వహించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్గౌడ ఆదేశించారు. మహిళా దినోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో, డివిజన్ స్థాయిలో ఐటీడీఏలో, పాడేరు, అరకులోయలోని నియోజకవర్గ స్థాయిల్లో, ప్రతి మండల కేంద్రంలోనూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రతి ఎంపీడీవో కార్యాలయంలోనూ ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన మహిళా మణులను వేడుకల్లో విధిగా భాగస్వాములను చేయాలని, ఉన్నతంగా ఎదిగిన మహిళల విజయగాథలను ప్రజలకు తెలిపి స్ఫూర్తి నింపాలన్నారు.
అధికారులతో మంత్రి సంధ్యారాణి వీడియో కాన్ఫరెన్స్
జిల్లాలో ఈ నెల 8న నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై రాష్ట్ర ఐసీడీఎస్, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి బుధవారం ఉదయం జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, ఐసీడీఎస్ పీడీ ఎన్.సూర్యలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సి.జమాల్ బాషా, ఎల్డీఎం ఎం.మోతునాయుడు, జిల్లా పరిశ్రమల అధికారి జి.రవిశంకర్, జిల్లా పౌరసంబంధాల శాఖాధికారి పి.గోవిందరాజులు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎల్.రజని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.