తుమ్మపాలలో వీఎంఆర్డీఏ పార్కు
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:52 PM
అనకాపల్లి జిల్లా కేంద్రంలో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్డీఏ)కొన్ని అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించింది.

హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయం
హెల్త్ సిటీ కోసం భూముల పరిశీలన
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)
అనకాపల్లి జిల్లా కేంద్రంలో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్డీఏ)కొన్ని అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించింది. దాదాపుగా రెండు దశాబ్దాల క్రితం రావు గోపాలరావు పేరుతో ఆడిటోరియం నిర్మించింది. ఆ తరువాత భారీ వ్యయంతో ఎటువంటి ప్రాజెక్ట్లు చేపట్టలేదు. వీఎంఆర్డీఏలో అనకాపల్లి జిల్లా కూడా కీలకమైనందున స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా కొన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్, కమిషనర్లను కూటమి నేతలు గత కొద్ది కాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలందరికీ ఉపయోగపడేలా హెల్త్ సిటీ ఏర్పాటు చేయాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ సూచించారు.
అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి తదితర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున బాధితులను మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తీసుకు వస్తున్నారని, ఇక్కడికి చేరేసరికి జాప్యం జరిగి కొందరు ప్రాణాలు కోల్పోతున్నందున అందుబాటులో మంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించడానికి వీలుగా హెల్త్ సిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనిపై అధికారులు క్షేత్ర స్థాయి పర్యటన చేసి తుమ్మపాలలో చెరువుకు సమీపాన డంపింగ్ యార్డును పరిశీలించారు. అక్కడ ఆస్పత్రుల కోసం హెల్త్సిటీ ఏర్పాటు చేయాలని భావించారు. ఆ తరువాత దానిపై చర్చలు జరిపారు. డంపింగ్ యార్డును చదును చేసిన తరువాత వెంటనే అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదని, కనీసం ఐదేళ్లు దాటిన తరువాతే నిర్మాణ పనులు ప్రారంభించాలని, లేదంటే సమస్యలు వస్తాయని ఇంజనీరింగ్ అధికారులు సూచించడంతో ఆ స్థలాన్ని పక్కన పెట్టారు.