తెగ తాగారు
ABN , Publish Date - Jan 17 , 2025 | 01:49 AM
సంక్రాంతి పండుగ మద్యం వ్యాపారులకు మంచి కిక్ ఇచ్చింది. భోగి, సంక్రాంతి, కనుమ...మూడు రోజుల్లో ఏకంగా రూ.24 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.
సంక్రాంతికి రూ.24 కోట్ల విలువైన మద్యం అమ్మకం
సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు...
నగరంలో తగ్గిన విక్రయాలు
భీమిలి, పెందుర్తి, గాజువాక సర్కిళ్లలో అధికం
విశాఖపట్నం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):
సంక్రాంతి పండుగ మద్యం వ్యాపారులకు మంచి కిక్ ఇచ్చింది. భోగి, సంక్రాంతి, కనుమ...మూడు రోజుల్లో ఏకంగా రూ.24 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. జిల్లాలో (జీవీఎంసీలో కలిసి ఉన్న అనకాపల్లి పట్టణంలోని ఐదు వార్డుల్లో 12 దుకాణాలను మినహాయించి) 145 మద్యం దుకాణాలు ఉండగా, 119 బార్లు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి ప్రతిరోజూ సగటున రూ.నాలుగైదు కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. కానీ సంక్రాంతి సందర్భంగా మందుబాబులు రెట్టింపు మద్యం సేవించారు. 13న భోగి పండుగ రోజు రూ.ఏడు కోట్లు మద్యం అమ్ముడైంది. 14న సంక్రాంతి రోజు రూ.ఎనిమిది కోట్లు, 15న కనుమ రోజున రూ.తొమ్మిది కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అయితే నగర నడిబొడ్డున ఉన్న దుకాణాల్లో విక్రయాలు గణనీయంగా తగ్గగా, శివారుప్రాంతాల్లో ఉన్న దుకాణాల్లో మాత్రం భారీగా పెరిగాయి.
నగరంలో నివాసం ఉంటున్న వారిలో అత్యధికులు సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వెళ్లడంతో సీతమ్మధార, మహారాణిపేట, మద్దిలపాలెం సర్కిళ్లలోని దుకాణాల్లో మద్యం విక్రయాలు తగ్గాయి. అదే సమయంలో గ్రామీణ వాతావరణం ఎక్కువగా ఉండే పెందుర్తి, గాజువాక, గోపాలపట్నం, భీమిలి వంటి ప్రాంతాల్లో పెరిగాయి. భీమిలి సర్కిల్లోని 32 దుకాణాలు, పెందుర్తి సర్కిల్లోని 36 దుకాణాలు, గాజువాక సర్కిల్లోని 33 దుకాణాలు, గోపాలపట్నం సర్కిల్లోని 14 దుకాణాల్లో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. మొత్తమ్మీద జిలావ్యాప్తంగా మద్యం విక్రయాలను పరిశీలిస్తే సాధారణ రోజుల్లో కంటే దాదాపుగా రెట్టింపు విక్రయించినట్టు వ్యాపారులు చెబుతున్నారు.