క్రూయిజ్ టెర్మినల్ నిర్వహణకు టెండర్లు
ABN , Publish Date - Feb 18 , 2025 | 01:34 AM
నగరంలో పర్యాటక అభివృద్ధి కోసం విశాఖపట్నం పోర్టు అథారిటీ రూ.100 కోట్లతో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ నిర్వహణకు సమర్థుల కోసం ఎదురుచూస్తోంది.
మరోమారు ఆహ్వానించిన పోర్టు
రెస్టారెంట్, గిఫ్ట్ షాపులు, చేతివృత్తుల కళాఖండాలు విక్రయించే షాపులు, ట్రావెల్ డెస్క్, బేకరీతో పాటు ప్రైవేటుగా బోటు జెట్టీకి కూడా అవకాశం ఇస్తామని ప్రకటన
అధ్వానంగా టెర్మినల్ రహదారి
దానిని బాగుచేస్తే తప్ప ఎవరూ వచ్చే పరిస్థితి లేదు
విశాఖపట్నం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి):
నగరంలో పర్యాటక అభివృద్ధి కోసం విశాఖపట్నం పోర్టు అథారిటీ రూ.100 కోట్లతో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ నిర్వహణకు సమర్థుల కోసం ఎదురుచూస్తోంది. దీని నిర్మాణం పూర్తిచేసి ఏడాది దాటిపోయింది. క్రూయిజ్లు ఏమీ రాకపోవడంతో ఆ టెర్మినల్ అలాగే ఉంది. దేశీయ క్రూయిజ్లతో పాటు విదేశీ క్రూయిజ్లను రప్పించడానికి పర్యాటక శాఖ, టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధులతో కలిసి ప్రయత్నాలు చేస్తోంది. టెర్మినల్ నిర్వహణలో పోర్టు అధికారులకు అనుభవం లేకపోవడంతో దానిని ఏదైనా ప్రైవేటు సంస్థకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించి టెండర్లను ఆహ్వానించింది. దానికి పెద్దగా స్పందన రాలేదు. సమీప భవిష్యత్తులో క్రూయిజ్లు వచ్చే సూచనలు లేకపోవడంతో దానిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు తాజాగా ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ జూన్లో కార్డెలియో సంస్థ ద్వారా మూడు ట్రిప్పులు ఓ క్రూయిజ్ని నడపడానికి ఒప్పించింది. అది వచ్చేలోపు ఇక్కడి పోర్టులోని క్రూయిజ్ టెర్మినల్లో పర్యాటకులకు అవసరమైన వసతులన్నీ సమకూర్చాలని పోర్టు అధికారులు నిర్ణయించారు. దీని కోసం తాజాగా సోమవారం టెండర్లు ఆహ్వానించారు. టెర్మినల్లో రెస్టారెంట్, గిఫ్ట్ షాపులు, చేతివృత్తుల కళాఖండాలు విక్రయించే షాపులు, ట్రావెల్ డెస్క్, బేకరీతో పాటు ప్రైవేటుగా బోటు జెట్టీకి కూడా అవకాశం ఇస్తామని ప్రకటించారు. దీనికి 11 నెలల లీజు పరిమితి ఉంటుందని, ఆసక్తి కలిగిన సంస్థలు ముందుకురావాలని కోరారు.
ఆ మార్గం బాగుపడితే తప్ప ఎవరూ రారు
పోర్టు అధికారులు క్రూయిజ్ టెర్మినల్ను పోర్టు ఆవరణలో నిర్మించారు. దీనికి వెళ్లే మార్గం చాలా దారుణంగా, అపరిశుభ్రంగా ఉంటుంది. అది ఇతరులు సంచరించడానికి అనుమతి కూడా లేని ప్రాంతం కావడం గమనార్హం. ఒంటరిగా అటు వైపు ఎవరైనా వెళితే ఏ దారుణమైనా జరిగే ప్రమాదం లేకపోలేదు. గతంలో పర్యాటక శాఖ అధికారులతో పోర్టు నిర్వహించిన సమావేశంలో ఇదే సమస్య చర్చకు వచ్చింది. టెర్మినల్కు వెళ్లే మార్గాన్ని అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. అయితే దీనిపై అధికారులు దృష్టి సారించలేదు. క్రూయిజ్లో వచ్చే పర్యాటకులు అందమైన విశాఖ నగరాన్ని చూడాలనుకుంటారు. వారు క్రూయిజ్ నుంచి దిగగానే ఆ దుర్గంధభరితమైన మార్గంలో నగరంలోకి వస్తే ఎంత వేగంగా వెనక్కి వెళ్లిపోదామా? అనే అభిప్రాయం కలుగుతుంది. పోర్టు అధికారులు ముందు ఆ మార్గాన్ని ఆకర్షణీయంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులూ అక్కడ కార్యకలాపాల నిర్వహణకు ముందుకువస్తారు. ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.