ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో పది మంది...
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:48 AM
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పది మంది పోటీలో ఉన్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ వెల్లడించారు.

నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు
27వ తేదీన పోలింగ్
22,493 మంది ఓటర్లు
123 కేంద్రాలు
ఏయూలో మార్చి 3న ఓట్ల లెక్కింపు
రిటర్నింగ్ అధికారి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్
విశాఖపట్నం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పది మంది పోటీలో ఉన్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని ఈసీ హాలులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభించామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు పటిష్ఠ చర్యలు తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగానే విశాఖ జిల్లాలో 12 ఎంసీసీ బృందాలు, ప్రతి మండలానికి ఒక ఫ్లైయింగ్ స్వ్కాడ్ నియమించామన్నారు.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈనెల 27వ తేదీ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఆరు జిల్లాల పరిధిలో 22,493 మంది ఓటర్లు (పురుషులు 13,508 మంది, మహిళలు 8,985) మంది ఉన్నారన్నారు. మొత్తం 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు సమకూర్చున్నామని, వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాటుచేస్తున్నామన్నారు. పోలింగ్లో పాల్గొనే సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇస్తున్నామని, ఓటర్లకు వివరాలతో స్లిప్పులు అందజేస్తామన్నారు. పోలింగ్ తరువాత బ్యాలెట్ బాక్సులు ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరుస్తామని, మార్చి 3వ తేదీన అక్కడే ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల తరువాత ప్రచారం నిర్వహించకూడదని కలెక్టర్ అన్నారు. విలేకరుల సమావేశంలో డీసీపీ అజితా వేజెండ్ల, డీఆర్వో భవానీశంకర్ పాల్గొన్నారు.